హైదరాబాద్, సెప్టెంబర్ 18: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టే తెలుగువారు గణనీయంగా పెరుగుతున్నారు. ప్రస్తుతం తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్లలో మ్యూచువల్ ఫండ్ ఆస్తుల విలువ రూ.2.95 లక్షల కోట్లకు చేరుకున్నట్టు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(ఆంఫీ) తాజాగా వెల్లడించింది. 2025 జూలై నాటికి ఉన్న ఫండ్ ఆస్తుల విలువ రూ.2.12 లక్షల కోట్లతో పోలిస్తే సరాసరి 19 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నట్టు తెలిపింది. ఈ పెట్టుబడుల్లో హైదరాబాద్ వాటా 87 శాతంగా ఉన్నట్టు, అలాగే ఆంధ్రప్రదేశ్ వాటా 23 శాతం వృద్ధితో రూ.82,409 కోట్లుగా నమోదైనట్టు వెల్లడించింది.
ఎస్ఐపీల వినియోగం పెరుగుతుండటం, క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక పెట్టుబడులకు అధిక ప్రాధాన్యత లభిస్తుండటం వల్లనే ఫండ్లలో పెట్టుబడులు పెరిగాయని ఆంఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట ఎన్ చలసాని తెలిపారు. మొత్తం పెట్టుబడుల్లో తెలంగాణ వాటా రూ.2,12,856 కోట్లతో టాప్-8వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఫండ్లలో పెట్టుబడులు పెట్టిన వారి సంఖ 19.60 లక్షలు ఉండగా, వీరిలో 24.42 శాతం మంది మహిళలు కావడం విశేషం.