కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఇండ్లను నిషేధిత జాబితాలో పెట్టి వేధిస్తున్నది. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 44 కాలనీల 9,792 కుటుంబాల జీవితాలతో చెలగాటమాడుతున్నది. రిజిస్ట్రేషన్ సమస్యతో అవస్థలు పడుతున్న ప్రజలకు 118 జీవో ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లోనే క్రమబద్ధీకరించింది. నాటి మున్సిపల్ మంత్రి మన నగరం కార్యక్రమంలో భాగంగా పేద, మధ్య తరగతి కుటుంబాల ఇండ్లను క్రమబద్ధీకరించి ఊరట కలిగించారు. 15 ఏండ్లుగా అవస్థలు పడుతున్న ప్రజల కండ్లల్లో కేసీఆర్ వెలుగులు నింపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 118 దొంగ జీవో అంటూ ప్రగల్భాలు పలికారు. ఆ జీవోను ఎత్తేస్తామంటూ 44 కాలనీల ప్రజలను వేధింపులకు గురిచేశారు. ఆయా కాలనీలను నిషేధిత జాబితాలో చేర్చి కంటికి కునుకు లేకుండా చేశారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో కింద ఉన్న ఇండ్లు, స్థలాలను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని ప్రకటించారు. కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ధ్వజమెత్తారు.
-సిటీ బ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ)/ఎల్బీనగర్
సిటీ బ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ)/ఎల్బీనగర్ :ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని 118 జీవో కాలనీల విషయంలో పూటకో మాట రోజుకో విధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించిందనే ప్రశ్నలు తల్తెతున్నాయి. కేసీఆర్ తీసుకొచ్చిన జీవోపై తీవ్ర విమర్శలు చేసి ప్రజలను వేధింపులకు గురిచేశారు. నిషేధిత జాబితాలో చేర్చి రాక్షసానందం పొందారు. ఇప్పుడు ఆ 44 కాలనీల ప్రజల ఇండ్లను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల తీరుతో మూడేండ్లుగా ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కేసీఆర్ ప్రభుత్వం 44 కాలనీల ప్రజలకు మేలు చేస్తే.. వారిని తిరిగి ఇబ్బందులకు గురిచేసేందుకు విశ్వప్రయత్నాలుచేశారు. వారందరినీ మానసికంగా వేధింపులకు గురిచేశారు. చివరకు 22ఏలో చేర్చి ఆగమ్యగోచర స్థితిలోకి నెట్టేశారు. చివరకు బీఆర్ఎస్ పోరాటం ఫలించి 44 కాలనీల ప్రజలకు న్యాయం దక్కింది.
జీవో 118 ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల కుట్రలు భగ్నమై చివరికి న్యాయం గెలిచిందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పేద, దిగువ మధ్యతరగతి ప్రజల కష్టాలు చూసి అధికారులు చేసిన తప్పిదాలను తీర్చేందుకు జీవో 118 ద్వారా పరిష్కార మార్గం చూపారన్నారు. కాంగ్రెస్ నాయకులు కొందరు ఈ 118 జీవోను దొంగ జీవో అని అవాకులు, చెవాకులు పేలారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల తర్వాత అదే జీవోను తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 118 జీవోకు మూడేళ్ల పాటు మోకాలడ్డు వేసిన నాయకులకు ప్రజలు మొట్టికాయలు వేస్తారని భయపడే జీవోను ఆమోదించారన్నారు. నిషేధిత జాబితాపై బీఆర్ఎస్ పోరాటంతో సీఎంకు ప్రజా వ్యతిరేకత అర్థం అయ్యిందని, ఆ తప్పిదాలను కప్పి పుచ్చుకునేందకే 118 జీవోను తిరిగి క్రమబద్ధీకరించాలని ప్రకటించారని అన్నారు.
నాడు జీవో 118ను మునుగోడు ఎన్నికల కోసం కేసీఆర్ ఇచ్చారంటూ ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే జీవోను జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధికోసం క్రమబద్ధీకరిస్తున్నదా? అంటూ ప్రశ్నించారు. గత జీవో ఇచ్చిన సమయంలో మిగిలిపోయిన వారికి కూడా కన్వీయన్స్ డీడ్లు ఇవ్వాలని తాము ఎన్నిమార్లు మొత్తుకున్నా కేవలం సుధీర్రెడ్డికి పేరు వస్తుందన్న నెపంతో పట్టించుకోలేదన్నారు. గత డీడ్లలోను అధికారుల తప్పిదాలతో కొందరి ఫ్లాట్ నెంబర్లు, కొందరి సరిహద్దులు మారాయని, కొంత మేర తప్పులు దొర్లాయని వాటిని సరి చేయాలని అధికారులను కోరితే దానికి తిరిగి స్టాంప్ డ్యూటీ ఫీజు కట్టమంటున్నారని, ఎలాంటి రుసుం లేకుండా వీటిని సరి చేయాలన్నారు. కార్యక్రమంలో కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు శరత్రెడ్డి, అంజిరెడ్డి, బద్ధం బాల్రెడ్డి, రాంబాబు, నంద్యాల సుధాకర్రెడ్డి, ముత్యంరావు, కృష్ణారెడ్డి, ధన్రాజ్, రాఘవేంద్ర శర్మ, మువ్వ సతీశ్, అమరేందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కటికరెడ్డి అరవింద్రెడ్డి, పొచంపల్లి రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.