హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రైస్ మిల్లర్ల సమస్యలను పరిష్కరించేందుకు సానుకూలంగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. సమ్మెకు దిగిన రైస్ మిల్లర్లను శాంతింపజేసేందుకు శుక్రవారం వారి సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్రెడ్డి, సుదర్శన్రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, డైరెక్టర్ శ్యామ్ప్రసాద్, అదనపు డైరెక్టర్ రోహిత్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున తూడి దేవేందర్రెడ్డి, గంప నాగేందర్, మోహన్రెడ్డి, గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. మిల్లర్ల వినతులను సానుకూల దృక్పథంతో పరిశీలిస్తామని, ప్రభుత్వ పరిధిలో ఏమి చేయగలమన్న దానిపై అన్ని కోణాల్లో ఆలోచిస్తామని, మిల్లర్లపై అనవసర భారం మోపాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. మిల్లర్ల ఇబ్బందులను సానుకూల దృక్పథంతో పరిశీలిస్తామని, మిల్లర్లు సమ్మెను విరమించాలని కోరారు.
ప్రభుత్వం ఎంత బుజ్జగించినప్పటికీ రైస్ మిల్లర్లు పట్టు వీడలేదు. తమ సమస్యలను పరిష్కరించే వరకు నిరవధిక బంద్ను కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన రాష్ట్ర కార్యవర్గం అత్యవసర సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉటూరి వీరేశం వెల్లడించారు.