హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తేతెలంగాణ) : ఉప్పల్ భగాయత్లో మహేంద్ర సంఘం ఆత్మగౌరవ భవనానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన స్థలంలో భవన నిర్మా ణానికి నెలలోగా నిధులు మంజూరు చేస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. అదేవిధంగా మేదరి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నియామకానికి చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. శుక్రవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ వెదురు దినోత్సవానికి పొన్నం హాజరయ్యారు. మేదరి వృత్తిదారులు కళాత్మకంగా రూపొందించిన వెదురు వస్తువులను పరిశీలించారు.
మేదరి జీవన విధానం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వెదురు పెంపకానికి స్థలాలు కేటాయిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో మహేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జొర్రీగల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కోన రాజశేఖర్, కోశాధికారి పాతకోటి ఉమ, ప్రచార కార్యదర్శి ప్యారసాని రమాకాంత్, సంఘం నేతలు ప్యారసాని బాలరాజు, కుమార్ మహేంద్ర, కోన శ్రీనివాస్, కోన బాలశేఖర్, మల్లేశం, రాజయ్య, సూర్నీడ శంకర్, అలిపిరెడ్డి లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.