ములుగు రూరల్/గోవిందరావుపేట/తాడ్వాయి, డిసెంబర్ 30 : కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో భాగమైన ఆరు గ్యారెంటీల అమలు కోసమే ప్రజా పాలన కార్యక్రమం చేపట్టినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఆమె శనివారం ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లో పర్యటించారు. ములుగు మండలం బండారుపల్లి గ్రామ పరిధిలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, గోవిందరావుపేట మండలం పస్రాలో సర్పంచ్ ముద్దబోయిన రాము అధ్యక్షతన, తాడ్వాయి మండలం మొండ్యాలతోగు, కొండపర్తి గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో సీతక్క మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలను అర్హులకు అందించేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 2 నుంచి 5వ తేదీలోగా వేతనాలు చెల్లించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. రాబోయే కాలంలో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా ములుగు జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మ దీవెనలతో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని చెప్పారు. గోవిందరావుపేట మండలం రాఘవపట్నం సమీపంలోని బ్రిడ్జిని మంత్రి పరిశీలించారు. జాతర దృష్ట్యా వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని, రూ.40లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు.
అంగన్వాడీ సెంటర్లను ప్రభుత్వ పాఠశాలల ఆవరణలోకి తరలిస్తామని వివరించారు. నూతనంగా నిర్మించే అంగన్వాడీ సెంటర్లను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే నిర్మించేలా చర్యలు చేపడుతామని మంత్రి తెలిపారు. పాఠశాలల్లో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతామన్నారు. 163వ జాతీయ రహదారి నుంచి కొండపర్తికి త్వరలోనే రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా గొత్తికోయల గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని ఆధికారులను ఆదేశించారు. గొత్తికోయలతో ప్రత్యేకంగా మాట్లాడిన సీతక్క పిల్లలు ఏ ఆహారాన్ని ఇష్టంగా తింటారో అంగన్వాడీ టీచర్లకు తెలుపాలని, అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
జిల్లాకు వచ్చిన హెచ్డీఎఫ్సీ కంపెనీ, టాటా గ్రూప్ సంస్థ ప్రతినిధులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి గిరిజనలు జీవన విధానాన్ని వివరించారు. ఆయాచోట్ల కార్యక్రమాల్లో ఎస్పీ గౌష్ ఆలం, ఐటీడీఏ పీవో అంకిత్, అదనపు కలెక్టర్ శ్రీజ, డీడబ్ల్యూవో ప్రేమలత, డీఆర్డీఏ పీడీ నాగపద్మజ, డీపీవో వెంకయ్య, బండారుపల్లి సర్పంచ్ అక్కల రఘోత్తం, ఉప సర్పంచ్ దొంగరి మహేందర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, ఎంపీటీసీ మావురపు తిరుపతిరెడ్డి, నాయకులు గొల్లపల్లి రాజేందర్గౌడ్, చింతనిప్పుల భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి పాల్గొన్నారు.