ములుగు జిల్లా వ్యాప్తంగా జూలై నెలలో రికార్డు స్థాయిలోనే వర్షాలు కురిశాయి. మూడు రెట్లు అదనపు వర్షపాతం నమోదైంది. ఈ ఒక్క నెలలో సాధారణ వర్షపాతం 58.3 సెంటీమీటర్లు కాగా, 112.1 సెంటీమీటర్లు నమోదైంది. 77శాతం అధికంగా దీంతో కొద్ది రోజులుగా చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయి. గంగమ్మ పైకి ఉబికి వస్తోంది. కొన్నిచోట్ల బోర్లు, చేతిపంపులు నిరంతరం ధారలు పోస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ముందు చూపుతో మిషన్ కాకతీయ పథకంతో చెరువులు, కుంటలు మరమ్మతులు చేసింది. ఎనిమిదేళ్లుగా అధిక నిధులు కేటాయిస్తూ హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించింది. ఈ చర్యలు ప్రస్తుతం ఫలితాలను ఇస్తున్నాయి.
ములుగు, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): జిల్లాలో జూలై నెలలో రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో చెరువులు, కుంటలు మరమ్మతు చేయడంతో నేడు జలకళ సంతరించుకున్నాయి. మరోవైపు ఎనిమిదేళ్లుగా హరితహారానికి అధికంగా నిధులు కేటాయిస్తూ మొక్కలు నాటి సంరక్షించడంతో విస్తారంగా వర్షాలు దీంతో గంగమ్మ ధార నిత్యం బోర్లు, చేతిపంపుల నుంచి ఉప్పొంగి వస్తోంది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 9 నుంచి 12అడుగుల లోతులోనే నీళ్లు లభ్యమవుతున్నాయి. కొన్ని చోట్ల బోర్లు, చేతిపంపుల నుంచి నీరు మోటర్లు లేకుండానే పైకి ఉబికి వస్తోంది.
బోర్లు, చేతిపంపుల నుంచి ధారలు
జిల్లాలో జలాలు గణనీయంగా పెరిగి పాతాల గంగ పైకి ఉబికి వస్తోంది. ఈ ఏడాది మే చివరి నుంచి జూలై వరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం కంటే మూడు రెట్లు అదనంగా పడ్డాయి. జూలైలోనే గోదావరి నది ఉధృతంగా ప్రవహించింది. ప్రధాన జలాశయాలైన రామప్ప, లక్నవరం సరస్సులతోపాటు జిల్లాలోని అన్ని చెరువులు కుంటలు మత్తళ్లు దుంకాయి. జూన్ నుంచి జూలై వరకు సాధారణ వర్షపాతం 58.3 సెంటీమీటర్లు కాగా, 112.1 సెంటీమీటర్లు నమోదైంది. అంటే 77శాతం అధికంగా ఈ ఏడాదిలో 63.26 సెంటీమీటర్లు కురవాల్సి ఉండగా, అదనంగా 112.1 సెంటీమీటర్లు కురిసింది. ఎనిమిదేళ్లలో ఏడాదే అత్యధిక వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ముప్పై ఏళ్లలో చూడని వరద జూలైలోనే చూశామని జిల్లా వాసులు అంటున్నారు.
ఫలించిన ప్రభుత్వ చర్యలు
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నుంచి నీటి సంరక్షణ చర్యలు చేపట్టడంతో ఆశించిన మేర భూగర్భజలాలు పెరిగాయి. మిషన్ భగీరథతో చెరువులకు, కుంటలకు పూర్వవైభవాన్ని తీసుకురావడంతోపాటు హరితహారం, పల్లెప్రగతి మొక్కలు నాటడం, ఉపాధి హామీ పథకంలో నీటి నిల్వకు సంబంధించిన పనులను చేపట్టారు. ఇంకుడుగుంతల ఏర్పాటుతోనూ భూగర్భ జలాలు పెరిగాయి. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో వానకాలం సాగు జోరుగా సాగుతోంది. పెరిగిన భూగర్భజలాలు జిల్లా రైతాంగానికి గొప్ప వరంగా మారాయి.