మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, ఇంద్రకరణ్రెడ్డి, గంగుల కమలాకర్
హరిత హోటల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్లతో భేటీ
హన్మకొండ, మే 7: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. శుక్రవారం గ్రేటర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్లతో మంత్రి ఎర్రబెల్లితో పాటు పరిశీలకులుగా వచ్చిన మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విప్ జారీ చేశారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన వారిలో ఎనిమిది మందికి కరోనా రావడం బాధాకరంగా ఉందన్నారు. వీరు వీడియో కాల్ ద్వారా ప్రమాణ స్వీకారం చేసి, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పాల్గొన్నట్లు తెలిపారు. కొన్ని సమీకరణాల దృష్ట్యా పార్టీ నిర్ణయం తీసుకుని, సీల్డ్కవర్లో పేర్లు పంపినట్లు తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తాను కూడా మున్సిపల్ కౌన్సిలర్గా రాజకీయ జీవితం ప్రారంభించి, మంత్రి అయినట్లు చెప్పారు. పార్టీని నమ్ముకుని ఉంటే అందరికీ అవకాశాలు వస్తాయన్నారు. టీఆర్ఎస్ క్రమశిక్షణ ఉన్న పార్టీ అని అన్నారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ 48 స్థానాలు గెలుపొందడం శుభసూచికమన్నారు. అనంతరం సీల్డ్ కవర్ను విప్పి, మేయర్గా గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్గా రిజ్వానా షమీమ్ మసూద్ను ప్రకటించారు. మధ్యాహ్నం హరితహోటల్ నుంచి ప్రమాణ స్వీకారోత్సవం జరిగే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్కు ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. సమావేశంలో ఎంపి పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు.