జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు హక్కు పత్రాల పంపిణీ కోసం చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియ జిల్లాలో ముమ్మారంగా సాగుతుంది. ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు చేపట్టిన పోడు భూముల హక్కు పత్రాల పంపిణీ కోసం జిల్లా వ్యాప్తంగా 191 గ్రామ పంచాయతీల పరిధిలోని 166 హ్యబ్రీటేషన్లకు చెందిన గిరిజన, గిరిజనేతరుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్థేశించిన నిబంధనల ప్రకారం.. స్థానికంగా నివసిస్తూ జీవనోపాధి కోసం వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటున్న రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
ఇప్పటి వరకు 19వేల దరఖాస్తులు
జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుంచి చేపట్టిన పోడు భూములకు హక్కు పత్రాల జారీ కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టగా, పోడు భూముల హక్కు పత్రాల కోసం సుమారు 19వేలకు పైగా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. 2005 డిసెంబర్ 13వ తేదీలోపు భూములను సాగు చేసుకుంటున్న లబ్ధిదారులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనే నిబందన మేరకు 50వేల ఎకరాలకు హక్కు పత్రాల జారీ కోసం దరఖాస్తులు చేసుకున్నారు.