బియ్యం, పప్పు దినుసులు, నూనె, పెరుగు, పాలు, పనీర్, బ్రెడ్, వంటి ప్యాకేజ్డ్ వస్తువులపై కేంద్రంలోని బీజేపీ సర్కారు జీఎస్టీ విధించి సామాన్యులపై మోయలేని భారం వేస్తున్నది. దీంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ‘భవిష్యత్లో మనిషి బతికున్నందుకు కూడా లైఫ్ ట్యాక్స్ పేరుతో పన్నులు వేస్తారేమో’నని కేంద్ర సర్కారు, ప్రధాని మోదీ తీరుపై సామాన్యులు మండిపడుతున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతి వస్తువు ధర రెండింతలకు పైగా పెరిగిందని, ఇలాగైతే బతుకుడు కష్టమేనని గృహిణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ ఎత్తేయకుంటే బీజేపీకి పుట్టగతులుండవని శాపనార్థాలు పెడుతున్నారు.
-వరంగల్, జూలై 21 (నమస్తే తెలంగాణ)
పాలు, పెరుగు, పప్పు, ఉప్పు, చెప్పు, చెక్కు, బుక్కు, పండు, గుడ్డు, బెడ్డు కాదేదీ పన్నులకనర్హం అన్నట్లుగా వ్యవహరిస్తున్నది కేంద్రంలోని బీజేపీ సర్కారు. పరోటాపై 18శాతం బాదుడు..దవాఖానలో చేరినా..శ్మశానం కట్టినా జీఎస్టీ వేసుడు ఆ పార్టీ దరిద్రపు పాలనకు అద్దం పడుతున్నది. పాలు, పెరుగు, లస్సీ, మజ్జిగ, పనీర్, బెల్లం, చక్కెర, తేనె, బియ్యం, గోధుమలు, బార్లీ, ఓట్స్, కొబ్బరి నీళ్లు, కూరగాయలు, బియ్యం పిండి ఒక్కటేమిటి మనిషి తినే అన్నిరకాల ఆహార పదార్థాలు, వాడే నిత్యావసరాలపై నరేంద్రమోదీ ప్రభుత్వం ఎడాపెడా పన్నుల మోత మోగిస్తున్నది. ఈ రంగం..ఆ రంగం అన్న తేడా లేకుండా అన్నిరంగాలపై..అన్నివర్గాలపై పన్నుపోటు పొడుస్తున్నది. 99 శాతం సేవలు, వస్తు ఉత్పత్తులపై జీఎస్టీ వేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇప్పటికే రోజుకోసారి పెట్రోల్, డీజిల్, నెలకోసారి గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుకుంటూ పోతున్నది.
ఇప్పుడు ఒకే మార్కెట్.. ఒకే పన్ను పేరుతో కేంద్ర రాష్ర్టాల పన్నులను ఏకం చేసి తెచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఆస్త్రంతో సామాన్యుల జేబులకు తూట్లు పొడుస్తున్నది. సగటు మనిషి బడ్జెట్ను తలకిందులు చేస్తున్న కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారుపై ప్రజలు రణం మోగించేందుకు సిద్ధమవుతున్నారు. పాలు, పాల ఉత్పత్తులపై ఐదు శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయించడంపై మహిళలు, రైతులు మండిపడుతున్నారు. చిరు వ్యాపారులను దోచుకొని కార్పొరేట్ కంపెనీలకు పెట్టేందుకు కేంద్రం దౌర్భాగ్యమైన చర్యకు పూనుకోవడంపై సర్వత్రా ఆందోళన నెలకొన్నది. పేదలు, సామాన్య, మధ్య తరగతి వర్గాలపై పన్నులు విధిస్తూ ధరలు పెంచుతూ పోతున్న కేంద్రం కార్పొరేట్లపై మాత్రం ఎక్కడాలేని కరుణ చూపుతున్నది. కార్పొరేట్ కంపెనీలకు వందల కోట్ల లబ్ధి చేకూరేలా ఆకస్మికంగా పన్నులు ఎత్తేసి..కొన్ని ఉత్పత్తులపై పన్ను తగ్గించి లేనివాడిని దోచుకొని ఉన్నవాడికి పెట్టే చర్యలు చేపడుతున్నది. పెట్రోల్, డీజిల్ ఎగుమతులు, క్రూడ్ ఆయిల్ ఉత్పత్తులపై జూలై 1 నుంచి కేంద్రం విండ్ఫాల్ ట్యాక్స్ విధించింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు సతమతమవుతుంటే ఎన్నో నెలలపాటు స్పందించని బీజేపీ సర్కారు, కార్పొరేట్ల పెట్రోల్ పన్నులను రద్దుచేయడంపై అన్ని వర్గాల ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్నది. ఒంట్లో బాగోలేకుంటే దవాఖానలో చేరినా.. దురదృష్టవశాత్తు చనిపోయినా పన్నుల నుంచి మాత్రం తప్పించుకోలేని దుస్థితిని మోదీ ప్రభుత్వం కల్పిస్తున్నది. పాలు, పెరుగు, పెన్సిళ్లు సహా దవాఖానలో బెడ్డు దగ్గర్నుంచి శ్మశానం దాకా జీఎస్టీ వర్తింపజేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. జాతి ప్రయోజనాల కోసం జీఎస్టీ తెచ్చామని గొప్పులు చెబుతున్న బీజేపీ సర్కారు, గలత్ ట్యాక్స్లు విధించడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహిళలు, రైతులు, చిరు వ్యాపారులు మండిపడుతున్నారు. ‘బీజేపీ పాలనతో అచ్చేదిన్ కాదు.. సచ్చే దినాలు వచ్చినయ్’ అని ఆక్రోశం వెలిబుచ్చుతున్నారు.
– వరంగల్, జూలై 21(నమస్తే తెలంగాణ)
బతికున్నందుకు కూడా పన్నుకట్టాల్నేమో!
నర్సింహులపేట: బతికున్నందుకు కూడా బీజేపీ పాలనలో పన్నులు కట్టాల్నేమో!. నిత్యావసరాల ధరలు పెరిగి పేదల జీవనం అధ్వానంగా మారింది. ఉద్యోగ కల్పన, సంక్షేమం, అభివృద్ధి ఊసులేకున్నా ప్రజల నుంచి మాత్రం ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్రు. పాలపైనా జీఎస్టీ వేయడం బీజేపీ దరిద్ర పాలనకు నిదర్శనం.
– బానోత్ విజయ, బీమ్లాతండా
ఎట్లా బతుకాలె?
భూపాలపల్లి టౌన్: రోజు తినే వస్తువులు, తినుబండారాలపై ధరలు పెంచితే లేనోళ్లం ఎట్లా బతుకాలె. పాలు, పెరుగు, పప్పులపై ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుడేంది?. మోదీకి మూడింది. ఎదురుతిరిగే రోజులు దగ్గర పడ్డయ్. ధరలు తగ్గించకపోతే తగిన బుద్ధి చెప్తం.
– తిక ఓదెమ్మ, భూపాలపల్లి
పాలు, పెరుగుపై పన్నులా?
భూపాలపల్లి టౌన్: ఇప్పటికే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ఇష్టం వచ్చినట్లు పెంచిన్రు. మోదీ ప్రభుత్వం ఇప్పుడు నిత్యావసరాలపై పన్నులేసి ఏం కొనలేకుంట చేస్తాండు. పాలు, పెరుగుపై జీఎస్టీ అంటే ఇంతకంటె అన్యాయముంటదా? దీనిపై తెలంగాణ బీజేపీ లీడర్లు మాట్లాడాలె.
– టీ స్వరూప, గృహిణి, భూపాలపల్లి.
మోయలేని భారం
హనుమకొండ చౌరస్తా: ప్రతి వస్తువుపై పన్నులు వేసి ప్రజలపై మోయలేని భారం వేస్తున్నారు. ఇప్పటికే గ్యాస్ ధర విపరీతంగా పెరిగింది. ఇప్పుడు తినే పదార్థాలపైనా పన్నులు వేస్తాన్రు. బీజేపీకి ఓట్లతోనే బుద్ధి చెప్తం.
– చల్లా భాగ్యలక్ష్మి, గృహిణి
ఇది న్యాయంగాదు
హనుమకొండ సబర్బన్: రోజూ కావాల్సిన పాలు, పాల ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీ వేసుడు న్యాయంగాదు. గతంల రెండు, మూడు వేల ఖర్చుతో నెలంతా ఎళ్లేది. ఇప్పుడు పదివేలు దాటుతాంది. ఉప్పు, పప్పు, పాలు అన్నింటి ధరలు బాగా పెరిగి ఇల్లు గడుసుడు కష్టమైతాంది.
– మునిగడప లావణ్య, గృహిణి
గిట్ల ధరలుంటె ఎట్ల?
ఎల్కతుర్తి: డీజిల్ ధరలు పెరుగుడుతోనే ట్రాక్టర్లోళ్లు కూడా ధరలు పెంచిన్రు. నెలకోసారి సిలిండర్ ధర పెరుగుతాంది. పాలమీద సుత పన్నేస్తరా ఎక్కన్నన్న? ఇదేం విచిత్రం. తినే వాటిపై పన్నులేస్తె ఎట్ల బతుకుడు? ధరలు తగ్గించకుంటే మోదీ సర్కారును గద్దె దించుతం.
– కొన్నె శశికళ, ఎల్కతుర్తి
గిట్టుబాటు అయితలేదు
ములుగు, నమస్తే తెలంగాణ: నేను కలెక్టరేట్లో హోటల్ నడపుతున్న. కరోనా కాలం నుంచి రోజురోజుకు సరుకుల ధరలు పెరుగుతున్నయ్. వ్యాపారం గిట్టుబాటైతలేదు. కిరాణా సామాన్లతోపాటు కూరగాయలు, పాలు, పెరుగు ధరలు పెరిగినయ్. అవసరమైన సరుకులు కొనే పరిస్థితి లేదు. ఈ జీఎస్టీ వల్ల ఎవరికి ఉపయోగమో మరె..
– అనిశెట్టి స్వరూప, హోటల్ నిర్వాహకురాలు, ములుగు
డికాషనే గతి
నల్లబెల్లి: జీఎస్టీతో మాకు ఇగ పాలకు బదులు డికాషనే గతి. పిల్లలకు గుక్కెడు పాలు పోయలేని దీన స్థితి. మధ్య తరగతోళ్లకు బీజేపీ ప్రభుత్వంలో భరోసా కరువైంది. మా గోస నరేంద్రమోదీకి తగుల్తది. పాలు, వాటి ఉత్పత్తులపై జీఎస్టీని వెంటనే రద్దు చేయాలె. లేదంటే బీజేపీ మట్టి కొట్టుకపోతది.
– పిట్టల రాజమణి, నల్లబెల్లి
ఇట్లయితే ఏం బతుకుతం?
కరీమాబాద్: రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలతోని ఎట్ల బతుకుతం.. గతంతో పోల్చితే బీజేపీ హయాంల ధరలు బాగా పెరిగినయ్. కుటుంబం గడుసుడు శాన కష్టమైతాంది. పేద, మధ్యతరగతి కుటుంబాల జీవనం దుర్భరంగా మారింది.
– బౌరిశెట్టి నిర్మల, గృహిణి
ధరల మంట పెట్టిన్రు
నర్సింహులపేట : బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు పెంచి మంట పెట్టింది. తినే ఆహార పదార్థాలపై పన్నుల భారం మోపడం సరికాదు. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తున్నది.
– గడ్డం సరోజన, నర్సింహులపేట
ధరలు ఆకాశాన
కేసముద్రం: నిత్యావసర వస్తువులపై జీఎస్టీ వేయడంతో ధరలు ఆకాశాన్నంటినయ్. పాలు, పెరుగు, మసాల వంటి వాటిపై పన్ను వేసి కేంద్రం పేదలకు అన్యాయం చేస్తున్నది. ప్యాకింగ్ వస్తువుల పైనా జీఎస్టీ వేసుడు మంచిది కాదు.
– లింగాల కవిత, గృహణి
సిగ్గుండాలె..
నయీంనగర్: నిత్యావసర వస్తులన్నింటిపై పన్ను లేసి పేదలను ఇబ్బంది పెడుతున్న కేంద్రానికి సిగ్గుండాలె. ఎంతో కష్టపడితే తప్ప కుటుంబం గడుస్త లేదు. ఇప్పటికే పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో భారంగ బతుకులీడుస్తున్నం. ఇప్పుడు పాలు, పెరుగు ఇతరాలపై జీఎస్టీ వేయడం సరికాదు. కేంద్రంలో బీజేపీ వచ్చిన్నప్పటి నుంచే ధరలు పెరుగుతున్నయ్.
– సుగుణ, న్యూశాయంపేట
సచ్చేదినాలు వచ్చినయ్
పోచమ్మమైదాన్: కేంద్రం పెంచుతున్న ధరలతోని మాకు అచ్చేదిన్గాదు.. సచ్చేదినాలు వచ్చినయ్.. పెట్రోల్ భారంతో పప్పులు, ఉప్పులు, పాలు, నూనెలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగినయ్. జీఎస్టీతో నెలకు రూ. 1600 నుంచి రూ.2000 దాకా మధ్య, దిగువ తరగతి కుటుంబాలపై భారం పడుతున్నది.
– చిప్ప లక్ష్మి, గృహిణి, కొత్తవాడ
దేశాన్ని అమ్ముతాన్రు
నయీంనగర్: బీజేపీకి దేశాన్ని అమ్మినప్పుడే కండ్లు సల్లవడుతయ్. పేదలపై పన్నులు వేసి బతుకకుండ చేస్తాంది. పాల ఉత్పత్తులపై జీఎస్టీ వేసుడు పిచ్చి నిర్ణయం. దాన్ని వెంటనే రద్దు చేయాలి.
– ఉడుతల స్పందన, కటాక్షపురం
రేట్లు డబులైనయ్
ములుగు, నమస్తే తెలంగాణ: నాలుగేళ్ల సంది ఉప్పులు, పప్పుల రేట్లు పెరిగినయ్. నూనె ప్యాకెట్ కొనే వశం లేదు. రెండేళ్ల కింద రూ.80 ఉండె. ఇప్పుడు రూ.200దాటింది. సబ్బులు, షాంపులు, కొబ్బరి నూనె డబ్బాలు అన్నీ ధరలు పెరిగి కొనలేకపోతున్నం. జీఎస్టో గీఎస్టో ఏందోగని కడుపు నిండ తినలేకుంటున్నం. పొద్దంత చేసిన పనికి వచ్చిన పైసలతోని ఒక్క పూట సామాన్లు సుత వత్తలేవు.
– చిగురాల సరిత, గృహణి, ములుగు
ఏదీ కొనలేం..
ములుగు, నమస్తే తెలంగాణ: నిత్యావసర సరుకులతోపాటు మందులు, కూరగాయలు కూడా కొనలేని పరిస్థితి ఉంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్తోపాటు అన్ని రేట్లు పెరిగినయ్. వీటికి తోడు ఇంటి కిరాయిలు కూడా పెరిగినయ్. నెలంతా పని చేసినా ఖర్చులు ఎల్లుతలేవు.
– రత్నం నీలాదేవి, గృహిణి, ములుగు