ప్రభుత్వం పెద్ద ఎత్తున కొలువుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ్ర గ్రూప్-1, ఖాకీ, విద్యుత్ శాఖల్లో కొలువులకు నోటిఫికేషన్లు విడుదల చేయగా మరికొన్ని ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో ఎలాగైనా కొలువు కొట్టాలనే కసితో ఉద్యోగార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కొందరు ప్రైవేటుగా కోచింగ్ తీసుకుంటుండగా, వేలకు వేలు చెల్లించే ఆర్థిక స్థోమత లేని వారికి మెరుగైన శిక్షణ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల ఆధ్వర్యంలో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసి ఉచిత కోచింగ్ ఇస్తున్నది. జనగామ జిల్లాలో ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 100 మంది నిరుద్యోగ అభ్యర్థులకు గ్రూపు -1, 2, 3, 4తో పాటు ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు ఉచితంగా 60 రోజుల ఫౌండేషన్ కోర్సు అందిస్తున్నది. దీంతోపాటు ఉద్యోగార్థులకు స్టాండర్డ్ స్టడీ మెటీరియల్, మధ్యాహ్న భోజనం కోసం ఒక్కొక్కరికి రూ.75 చెల్లిస్తున్నారు. రీజనింగ్, ఇండియన్, తెలంగాణ జాగ్రఫీ, చరిత్ర, కరెంట్ అఫైర్స్ వంటి అంశాలపై ఎక్స్పర్ట్స్తో శిక్షణ ఇస్తున్నారు.
జనగామ చౌరస్తా, మే 29 : దేశచరిత్రలో నిలిచిపోయేలా ఒకేసారి 80,039 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో కోటి ఆశలతో ఉద్యోగార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఎలాగైనా కొలువు కొట్టాలనే కసితో తమకు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుని ప్రిపేరవుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని కోచింగ్ సెంటర్లకు డిమాండ్ ఏర్పడింది. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తుండడంతో ఆర్థిక స్థోమత లేని కొందరు ఇళ్ల వద్దనే చదువుకుంటున్నారు. ఇలాంటి వారికి మెరుగైన శిక్షణ అందించాలని రాష్ట్ర సర్కారు కంకణం కట్టుకున్నది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖ స్డడీసర్కిళ్ల ఆధ్వర్యంలో కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ఉచితంగా కోచింగ్ ఇస్తున్నది. జనగామ జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 100 మంది ఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులకు గ్రూపు-1, 2, 3, 4తో పాటు ఎస్సై, కానిస్టేబు ల్ వంటి పోస్టులకు ఉచితంగా 60 రోజుల ‘ఫౌండేషన్ కోర్సు’ను అందిస్తున్నారు. అంతేకాకుండా అభ్యర్థి సక్సెస్ అయ్యేలా నిపుణుల పర్యవేక్షణలో రూపొందించిన నాణ్యమైన మెటీరియల్ను కూడా అందిస్తున్నా రు. జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మే 6వ తేదీ నుంచి 100 మంది నిరుద్యోగ అభ్యర్థులకు గ్రూపు -1, 2, 3, 4తో పాటు ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు ఉచితంగా 60 రోజుల ఫౌండేషన్ కోర్సు అందిస్తున్నారు.
జిల్లా కేంద్రంలోని గీతానగర్లో ఉన్న ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో నిపుణులైన అధ్యాపకులతో ‘జాబ్ గ్యారెంటీ’ అనే పద్ధతిలో గ్రూపు 1, 2, 3, 4 అభ్యర్థులకు, ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మడికొండ పీటీసీ కళాశాలలో ఉద్యోగ శిక్షణనిస్తున్నారు. శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.1500 విలువై స్టాండర్డ్ మెటీరియల్ను ఉచితంగా అందజేయడంతో పాటు మధ్యాహ్నం భోజన ఖర్చుల కోసం రోజుకు రూ.75 చొప్పున అభ్యర్థులకు డబ్బులు చెల్లిస్తున్నారు.60 రోజుల శిక్షణా కాలంలో నిపుణులైన సబ్జెక్ట్ ఎక్స్ఫర్ట్లతో ఆర్థమెటిక్ 45 గంటలు, రీజనింగ్ 30 గంటలు, సైన్స్ అండ్ టెక్నాలజీ 30 గంటలు, పాలిటీ 30 గంటలు, జాగ్రఫీ 30 గంటలు, ఇండియన్ హిస్టరీ 45 గంటలు, తెలంగాణ ఉద్యమం 30 గంటలు, ఇండియన్ ఎకానమీ 20 గంటలు, కరంట్ అఫైర్స్ 40 గంటలు చొప్పున మొత్తం 300 గంటల తరగతుల నిర్వహణకు టైం టేబుల్ రూపకల్పన చేశా రు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయం త్రం 4 గంటల వరకు శిక్షణ తరగతులు నడుస్తున్నా యి. అదేవిధంగా గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వర కు అందుబాటులో ఉన్న గ్రంథాలయాల్లో స్టడీ మెటీరియల్స్ అందుబాటులో ఉంచారు.
ఎస్సై కొలువు సాధిస్తా..
నేను బీఎస్సీ (ఎంపీసీఎస్) పూర్తి చేశాను. మాది నిరుపేద కుటుంబం. ఎస్సై కొలువు సాధించాలన్నది నా స్వప్నం. దానికోసం వేలకు వేలు ఫీజులు కట్టి ప్రైవేట్గా శిక్షణ తీసుకునే ఆర్థిక స్థోమత నాకు లేదు. జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ ద్వారా ప్రభుత్వం 60 రోజుల ఉచిత కోచింగ్, రూ.1500 విలువైన మెటీరియల్ను ఇస్తున్నది. మధ్యాహ్న భోజనం కింది ప్రతిరోజూ రూ.75 ప్రభుత్వం ఉచితంగా చెల్లిస్తుంది. లైబ్రరీలో కూడా విలువైన స్టడీ మెటీరియల్ను అందుబాటులో ఉంచారు.
– తుంగ దీపిక, ఎస్సై అభ్యర్థి, కొత్తపల్లి గ్రామం, లింగాల ఘనపురం మండలం
ఎక్ప్పర్ట్స్ బోధన అందిస్తున్నారు..
బీకామ్ (కంప్యూటర్స్) పూర్తి చేశాను. డిప్యూటీ తహసీల్దార్ కావాలన్నదే నా లక్ష్యం. బయట కోచింగ్ సెంటర్లకు వెళ్లి శిక్షణ తీసుకునే స్థోమత లేదు. జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రభు త్వం గ్రూపు 1,2, 3, 4 అభ్యర్థులకు అందించే 2 నెలల ఉచిత ఫౌండేషన్ కోర్సుకు హాజరవుతున్న. ఇక్కడ అన్ని సబ్జెక్టులు బోధిస్తున్నారు. ఉచిత కోచింగ్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
సుద్దాల రాజు, అశ్వరావుపల్లి, రఘునాథపల్లి
వంద మందికి శిక్షణ
రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో 100మంది నిరుద్యోగ అభ్యర్థులకు గ్రూపు 1, 2, 3, 4తో పాటు ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల సాధన కోసం 2 నెలల ఉచిత ఫౌండేషన్ కోర్సు అందిస్తున్నాం. రూ.1500 విలువైన స్టడీ మెటీరియల్ను ఒక్కో అభ్యర్థికి ఉచితంగా అందజేస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్తున్న అభ్యర్థులకు మధ్యాహ్నం భోజనం కోసం రూ.75 చెల్లిస్తున్నాం. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– ఎన్ కోర్నేలియస్, జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి, జనగామ