దేవరుప్పుల, మే 13 : కేంద్రం చేతులెత్తేసినా రైతుల కోసం పెద్దమనసు చేసుకొని సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోళ్ల బాధ్యత తీసుకోవడం సాహసోసపేత నిర్ణయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చినమడూరులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయ న తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రానికి ధాన్యం తెచ్చి న రైతులతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావం నుంచి రైతు సంక్షేమం కోసం కేసీఆర్ పరితపిస్తూ.. రైతు పక్షపాతిగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్రంలో సాగునీరు పుష్కలమవడంతో రైతుల వలసలు ఆగాయని, ఆత్మహత్యలకు తెరపడిందని, ఇటు వాణిజ్యపంటలు, అటు వరిసాగు పెరిగి, రైతు ఆర్థికంగా ఎదిగాడని సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణను అన్ని రకాలుగా మోసం చేస్తున్నదని, ము ఖ్యంగా రైతుల విషయంలో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ నాయకుల రెండు నాల్కల ధోరణి వల్ల ధాన్యం విషయంలో రైతులకు అన్యాయం జరిగిందన్నారు.
యాసంగి ధాన్యం కొనేదిలేదని కేంద్రం మొండికేసిన తరుణంలో రూ. 1300కోట్ల నష్టాన్ని తెలంగాణ ప్రభుత్వం భరిస్తూ కొనుగోళ్లు చేపట్టిందన్నారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రం ఏమాత్రం సహకరించడం లేదని, ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుందని, రైతులు సంయమనం పాటించి సహకరించాలని కోరారు. కాగా, చినమడూరు రైతులు లారీలు రాక తూకం ధాన్యం బస్తాలు నిలిచిపోయాయని మంత్రి దృష్టికి తేవడంతో వెంటనే కలెక్టర్ శివలింగయ్యతో ఫోన్లో మాట్లాడి లారీలు వెనువెంటనే వచ్చేలా చూడాలని ఆదేశించారు. అనంతరం దారిలో ఉపాధి కూలీలు కనిపించడంతో ఎర్రబెల్లి తన కారు దిగి.. వారి వద్దకు వెళ్లి కాసేపు ముచ్చటించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయమే పనులు చేయాలని, కూలి గిట్టుబాటు అవుతోందా? అని మహిళా కూలీలను అడిగి తెలుసుకున్నారు. కూలీలకు అన్ని వసతులు కల్పిస్తున్నామని, ఉపాధి పనుల విషయంలో తెలంగాణ ముందువరుసలో ఉందన్నారు. కాగా, మహిళలు తెచ్చుకున్న టిఫిన్ బాక్స్లను తెరిచి కూరలను తింటూ వారితో మమేకమయ్యారు.