Vemulawada | వేములవాడ, జూలై 26: వేములవాడ రాజన్న ఆలయ కళ్యాణకట్టలో నాయి బ్రాహ్మణులు అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో రమాదేవి హెచ్చరించారు. కళ్యాణ కట్టలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ సోషల్మీడియాలో ఓ భక్తురాలు చేసిన ఆరోపణలను తాజాగా నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన ఈవో రమాదేవి.. పీఆర్వో కార్యాలయంలో నాయి బ్రాహ్మణులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భక్తుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ నగదు డిమాండ్ చేయరాదని సూచించారు.
ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతమైతే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈవో వార్నింగ్ ఇచ్చారు. భక్తులు సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు చేయడం ద్వారా ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని అన్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే నేరుగా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేస్తే తక్షణమే విచారించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.