కాళేశ్వరం, ఏప్రిల్ 23 : అశేష భక్తజన ప్రవాహంతో త్రివేణి సంగమ తీరాన సందడిగా నెలకొంది. పుష్కరాల్లో భాగంగా ప్రణీత నదిలో పుణ్యస్నానమాచరించి, ముక్తీశ్వర స్వామిని దర్శించుకునే భక్తులతో కాళేశ్వరం శోభాయమానంగా మారింది. పుష్కరాల్లో 11వ రోజైన శనివారం తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్నాటక, తమిళనాడు తదితర రాష్ర్టాల నుంచి కాళేశ్వరానికి సుమారు లక్ష మంది తరలివచ్చారు. ఎండ వేడిమిని సైతం లెక్కచేయక కుటుంబసమేతంగా నది వైపు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించారు. సైకత లింగాలకు పూజలు చేసి నదిలో దీపాలు వదిలారు. అనంతరం కాళేశ్వరం దేవస్థానంలో స్వామి వారి దర్శనం కోసం బారులు తీరారు. కాగా చివరి రోజు ఆదివారం కాళేశ్వరానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశముంది.
పుష్కరాల్లో భాగంగా శనివారం ప్రాణహిత నదీమాతకు అర్చకులు త్రిహారతులు ఇచ్చారు. మంగళవాయిద్యాలు, కోలాటాలు వేదమంత్రాల నడుమ త్రివేణి సంగమం నదికి పూలు, పండ్లు, వస్త్రాలు కుంకుమ, పసుపు వేసి వాయినం సమర్పించి అర్చకులు కృష్ణమూర్తి శర్మ ప్రత్యేక పూజలు చేశారు.
ప్రణీత పుష్కరాలు నేటితో సమాప్తం కానున్నాయి. ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాలు ఈ నెల 13న ప్రారంభం కాగా, ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు ముగియనున్నాయి. వేద పండితులు మంత్రోచ్ఛారణల నమడు నదీమ తల్లికి హారతి ఇచ్చి, సారె పెట్టి సాగనంపుతారు. కాళేశ్వరంలోని త్రివేణి సంగమంతో పాటు అర్జునగుట్ట, తుమ్మిడిహట్టి వద్ద పారుతున్న ప్రాణహిత నదుల్లో 11రోజుల పాటు పుష్కరాలు ఘనంగా సాగాయి.