కరీమాబాద్, ఏప్రిల్ 15 : యువత పాజిటివ్ ఆలోచనలతో ఉద్యోగ ప్రయత్నం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి సూచించారు. అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ అరూరి విశాల్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా ఉద్యోగార్థుల కోసం మామునూరులోని పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తరుణ్జోషి మాట్లాడుతూ.. యువత సమస్యలను అధిగమించి పట్టుదలతో చదవాలన్నారు. ఉద్యోగం సాధించేందుకు అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, పేపర్లను నిత్యం చదవాలన్నారు. ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించాలన్నారు. కలెక్టర్ గోపి మాట్లాడుతూ.. ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా యువత పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. ఉద్యోగ సాధనకు యువత ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాలన్నారు. ఒత్తిడిని అధిగమిస్తూ పోటీ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. పీటీసీ ప్రిన్సిపాల్ పూజ మాట్లాడుతూ.. ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే సంకల్పంతో యువత పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో మామునూరు ఏసీపీ నరేశ్ కుమార్, కార్పొరేటర్లు ఇండ్ల నాగేశ్వర్రావు, అరుణ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్న నేపథ్యంలో యువత కోసం అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ ఇస్తున్నామని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొన్నారు. పేద, వసతులు లేని వారు సైతం ఉద్యోగాలను సాధించాలనే ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందలాది మంది యువత కోచింగ్ కోసం పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్ అండగా ఉన్నారన్నారు. ఉద్యోగార్థులకు దిశానిర్దేశం చేయాలనే అధికారులను ఆహ్వానించామని తెలిపారు. వారి అనుభవాలను యువతకు వివరించి మోటివేట్ చేశారన్నారు.
– అరూరి విశాల్, అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్
సేవ చేయాలనే లక్ష్యంతోనే తాత జ్ఞాపకార్థం అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ (ఏజీఎఫ్) స్థాపించాం. ఫౌండేషన్ ద్వారా చేసిన సేవలకు ఇప్పటికే జాతీయస్థాయి అవార్డు లభించింది. 90 రోజల పాటు ఉచితంగా అందించే శిక్షణ ద్వారా యువత ఉద్యోగాలు సాధించాలి. శిక్షణతో పాటు అన్ని వసతులు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.