నర్సంపేట, మార్చి 24 : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొనేదాక వదిలేది లేదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గురువారం నర్సంపేటలో టీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్రప్రభుత్వం తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నదన్నారు. పంజాబ్పై ప్రేమను, తెలంగాణపై విషాన్ని చిమ్ముతున్నదన్నారు. ధాన్యం మొత్తం కొనుగోలు చేసేంత వరకు కేంద్రంపై నిరసనలు తెలుపాలన్నారు. తెలంగాణ ప్రజల కలలు సాకారమయ్యేంతవరకు విశ్రమించేది లేదన్నారు. జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో అభివృద్ధిలో నర్సంపేట నియోజకవర్గం ముందున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్ని గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి ప్రతులను ప్రధాన మంత్రికి పంపించాలన్నారు. కేంద్రం రెండు పంటల వడ్లు కొనేవరకు నిర్విరామంగా కొనసాగే నిరసన కార్యక్రమాల్లో రైతులు పాల్గొనాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు రైతులు అండగా నిలువాలన్నారు. కార్యక్రమంలో జడ్పీఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, ఎంపీపీలు కళావతి, విజేందర్, రమేశ్, ప్రకాశ్రావు, కాట్ల కోమల, జడ్పీటీసీ సభ్యులు పత్తినాయక్, సరోజన, మండలాధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, రాజేశ్వర్రావు సారంగపాణి, సత్యనారాయణ, సూరయ్య, బాల్నె వెంకన్నగౌడ్, బుర్రి తిరుపతి పాల్గొన్నారు.