ఖైరతాబాద్, ఆగస్టు 1 : నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న ఓ యువతిపై మరో రోగికి సహాయకుడిగా వచ్చిన వ్యక్తి కీచక పర్వానికి ఒడిగట్టాడు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు గత నెల 27న రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడి రెండు కాళ్లు విరిగిపోయిన కుమార్తె(18) ను నిమ్స్లో చేర్చాడు. ఆమెకు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున తండ్రి మరుగుదొడ్డికి వెళ్లిన సమయంలో పక్క బెడ్లో చికిత్స పొందుతున్న రోగికి సహాయకుడిగా వచ్చిన నాగేశ్వర్రావు అనే వ్యక్తి యువతి వద్దకు వెళ్లి అసభ్యకరంగా తాకుతూ లైంగికంగా వేధించాడు.
ఘటన అనంతరం తీవ్ర భయాందోళనకు గురైన యువతి తన తండ్రికి జరిగిన దారుణాన్ని వివరించింది. విషయాన్ని అదేరోజు సాయంత్రం ఆస్పత్రి సిబ్బందికి తెలియజేయగా, పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రిలోని సీసీటీవీ దృశ్యాలు, అక్కడి సిబ్బంది, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను సేకరించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడు నాగేశ్వర్రావు ఏపీలోని భీమవరానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు పంజాగుట్ట సీఐ జహంగీర్ యాదవ్ తెలిపారు.