ఖమ్మం : కాంగ్రెస్ ప్రభుత్వానికి విధ్వంసం, కూల్చివేతలు ( Destruction ) తప్ప మరో ఎజెండా కనిపించడం లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( Puvvada Ajany kumar ) విమర్శించారు. ఖమ్మం పట్టణం శ్రీనివాస్ నగర్ ప్రాంతంలో ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న బాధితులకు ఆయన మద్దతు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Government ) అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కోసం కొత్తగా నిర్మించిన ఇళ్ల కంటే, వివిధ కారణాలతో కూల్చివేసిన ఇళ్లే ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. వికాసం చేతకాని ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడుతోందని మండిపడ్డారు. పేదల ఇళ్లను కూల్చివేసి వారి జీవనోపాధిపై ప్రభావం చూపడం సరి కాదని, పేదల పొట్ట కొట్టే చర్యలను ప్రభుత్వం నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఇళ్ల కూల్చివేత ఆలోచనను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విరమించుకోవాలని కోరారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఖమ్మం నగరంలో అనేక మంది పేదలకు ఇళ్ల పట్టాలు అందించడంతో పాటు, పేదలకు గృహ వసతి కల్పించేందుకు చర్యలు చేపట్టామని గుర్తు చేశారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడం తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమైతే, ఇప్పుడు పేదల ఇళ్లు కూల్చివేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఘనతగా మారిందని విమర్శించారు.