వరంగల్, జూలై 29 (నమస్తేతెలంగాణ): ప్రభుత్వ అనుమతి లేకుండా పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఇర్ఫాన్ జిల్లాలోని రైస్మిల్లర్ల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) తీసుకోవడం ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇర్ఫాన్ను సస్పెన్షన్ చేసిన కలెక్టర్.. ఇంకెవరెవరి పాత్ర ఉందనే కోణంలో విచారణ చేపట్టారు. ఇర్ఫాన్ అక్రమంగా రైస్మిల్లర్ల నుంచి తీసుకున్న బియ్యం నిల్వలు గోదాముల్లో ఉన్నయా? లేవా? అనే అంశంపైనా ఆరా తీస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని రైస్మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా డెలివరీ చేసిన బియ్యం నిల్వలను తిరిగి గోదాముల నుంచి తీసుకెళ్లాలని చెప్పారు. ఇర్ఫాన్ ఇటీవల జిల్లాలోని రైస్మిల్లర్ల నుంచి అక్రమంగా సీఎంఆర్ తీసుకోవడం, ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి రావడంతో కలెక్టర్ గోపి అక్రమాలకు బాధ్యుడైన డీఎం ఇర్ఫాన్ను సస్పెండ్ చేస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అనూహ్య రీతిలో జరిగిన ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నది.
సమగ్ర విచారణకు ఆదేశం..
ప్రభుత్వ అనుమతి లేకుండా డీఎం ఇటీవల జిల్లాలోని రైస్మిల్లర్ల నుంచి ఎన్ని టన్నుల బియ్యాన్ని తీసుకున్నాడు?, ఆ బియ్యం దిగుమతి ఎన్ని గోదాముల్లో జరిగింది?, రికార్డుల ప్రకారం బియ్యం నిల్వలు సదరు గోదాముల్లో ఉన్నాయా? వాటిని ఇచ్చిన రైస్మిల్లర్లలో ఎవరెవరు ఉన్నారు? అనే అంశంపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం తన దృష్టికి వచ్చిన ఈ అక్రమ బాగోతంపై కలెక్టర్ లోతుగా విచారణ జరుపుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రభుత్వ అనుమతి లేకుండా ఇటీవల డీఎం ఇర్ఫాన్ జిల్లాలోని రైస్మిల్లర్ల నుంచి సుమారు 28 టన్నుల సీఎంఆర్ తీసుకున్నట్లు తేలింది. ఈ బియ్యాన్ని వరంగల్తోపాటు నర్సంపేట, నెక్కొండ తదితర ప్రాంతాల్లో ఎస్డబ్ల్యూసీ గోదాముల్లో దింపినట్లు రికార్డుల ద్వారా బయటపడింది. అనుమతి లేని బియ్యం దిగుమతి జరిగిన ఎస్డబ్ల్యూసీ గోదాముల రికార్డులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఫిజికల్ వెరిఫికేషన్లో రికార్డుల ప్రకారం ఎస్డబ్ల్యూసీ గోదాముల్లో నిల్వలు లేవని తేలినట్లు సమాచారం. దీంతో ఈ అక్రమాల్లో డీఎం ఇర్ఫాన్తోపాటు సీఎంఆర్ పాస్ చేసే టీఏలు, ఎస్డబ్ల్యూసీ గోదాముల ఇన్చార్జిల్లో కొందరి పాత్ర కూడా ఉంటుందని ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇర్ఫాన్ రైస్మిల్లర్ల నుంచి ఏకంగా 28 వేల టన్నుల సీఎంఆర్ తీసుకోవడం, ఎస్డబ్ల్యూసీ గోదాముల్లో దిగినట్లు చెపుతున్న 28 వేల టన్నుల బియ్యం నిల్వలను పరిశీలిస్తే స్టాక్ తక్కువగా ఉండడంతో ఒక్కసారిగా ఉన్నతాధికారులు ఉలిక్కి పడ్డారు. ఇర్ఫాన్ తమ కళ్లు గప్పి రైస్మిల్లర్లతో కలిసి ఈ దందా చేయడాన్ని సీరియస్గా తీసుకుంటున్నారు. తన దృష్టికి వచ్చిన వెంటనే రెండు రోజుల క్రితం కలెక్టర్ పౌరసరఫరాల సంస్థ డీఎంతోపాటు ఈ సంస్థలో పని చేస్తున్న జిల్లాలోని ఇతర అధికారులను కూడా పిలిచి అనుమతి లేకుండా రైస్మిల్లర్ల నుంచి సీఎంఆర్ తీసుకోవడంపై ప్రశ్నించినట్లు తెలిసింది. అనంతరం పౌరసరఫరాల శాఖ కమిషనరుతోనూ మాట్లాడాకే కలెక్టర్ ఈ వ్యవహారంలో చర్యలకు పూనుకున్నట్లు సమాచారం.
చేతులు మారిన డబ్బు
అనుమతి లేకుండా డీఎం ఇర్ఫాన్ రైస్మిల్లర్ల నుంచి సీఎంఆర్ తీసుకున్న వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చిందని తెలిసింది. తమ రైస్మిల్లుల్లో ధాన్యం నిల్వలు ఉండడంతో రైస్మిల్లర్లలో కొందరు డీఎం ఇర్ఫాన్ను కలిసి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో తమ నుంచి సీఎంఆర్ తీసుకోవాలని పేర్కొన్నట్లు సమాచారం. చర్చల్లో ఒక అవగాహన కుదరడంతో ఇర్ఫాన్ రైస్మిల్లర్ల నుంచి ప్రభుత్వ అనుమతి లేకుండానే అదనంగా సుమారు 28 వేల టన్నుల సీఎంఆర్ తీసుకుని జిల్లాలోని ఎస్డబ్ల్యూసీ గోదాముల్లో దిగుమతి చేయించినట్లు ఉన్నతాధికారుల విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో 290 క్వింటాళ్లతో కూడిన ఒక్కో ఏసీకేకు రూ. 5 వేల చొప్పున మొత్తం సుమారు రూ. 50 లక్షలు చేతులు మారాయని ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. ఈ ముడుపుల బాగోతంపైనా పౌరసరఫరాల శాఖలోని అధికారులు విచారణ జరుపుతున్నారు. రైస్మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ప్రభుత్వ అనుమతి లేకుండా డెలివరీ చేసిన సీఎంఆర్పై చర్చించారు. ఎస్డబ్ల్యూసీ గోదాముల్లోని అనుమతి లేని సీఎంఆర్ నిల్వల్లో తేడాల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వ అనుమతి లేకుండా పెద్ద మొత్తంలో ఇచ్చిన సీఎంఆర్ను ఎస్డబ్ల్యూసీ గోదాముల నుంచి తిరిగి తీసుకెళ్లాలని కలెక్టర్ రైస్మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులకు చెప్పారు. దీంతో తాము ఎస్డబ్ల్యూసీ గోదాముల్లో దిగుమతి చేసిన సీఎంఆర్ నిల్వల్లో కొన్నింటిని పౌరసరఫరాల శాఖ అధికారులు చౌకడిపోలకు పంపారని రైస్మిల్లర్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో అనుమతి లేకుండా రైస్మిల్లర్లు డెలివరీ చేసిన సీఎంఆర్పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై ఉన్నతాధికారులు చర్చిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లాలో పౌరసరఫరాల సంస్థ, రైస్ ఇండస్ట్రీలోనూ ఆసక్తిర చర్చనీయాంశమైంది.