ఖిలావరంగల్, మార్చి 09 : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గోరుగుట్ట తండాలో అక్రమంగా కొనసాగుతున్న మద్యం బెల్ట్ షాపులు, గుడుంబా కేంద్రాలను వెంటనే తొలగించాలని కోరుతూ గ్రామ మహిళలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో గోరుగుట్ట తండా సర్పంచ్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో సుమారు 40 మంది మహిళలు పాల్గొని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు వినతిపత్రం సమర్పించారు.
గ్రామంలో బెల్ట్ షాపులు, గుడుంబా కేంద్రాలు అధికంగా ఉండడంతో యువత నిత్యం మద్యం సేవిస్తూ గొడవలకు దిగుతున్నారని మహిళలు కలెక్టర్కు వివరించారు. మద్యం కారణంగా కుటుంబాల్లో కలహాలు పెరిగి చాలా కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మద్యం సేవించిన తర్వాత ఖాళీ సీసాలను రోడ్లపై పగలగొడుతున్నారని, దీంతో గ్రామంలో తిరిగే పశువులకు, ప్రజలకు గాయాలు అవుతున్నాయని తెలిపారు. కాబట్టి గోరుగుట్ట తండాలో కొనసాగుతున్న అక్రమ బెల్ట్ షాపులు, గుడుంబా కేంద్రాల నిర్వాహకులపై వెంటనే చర్యలు తీసుకొని వాటిని తొలగించాలని మహిళలు జిల్లా కలెక్టర్ను కోరారు.