ఖిలావరంగల్, మార్చి 25: వరంగల్ రైల్వే స్టేషన్లో విషాద ఘటన చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున సుమారు 1:40 గంటల సమయంలో సుమారు 35–40 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని మహిళ రైలు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు జారి పడడంతో దుర్మరణం చెందింది. వరంగల్ జీఅర్పీ హెడ్ కానిస్టేబుల్ రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్లాట్ఫాం నంబర్ 3, 4 వద్ద నిలిచిన ట్రైన్ నెం. 12746 మణుగూరు ఎక్స్ప్రెస్ ఎక్కుతున్న క్రమంలో గుర్తు తెలియని మహిళ ప్రమాదవశాత్తు జారి ఫ్లాట్ ఫాం, రైలుకు మధ్యలో పడింది. ఈ ప్రమాదంలో ఆమె కుడి చెయ్యి, ఎడమ కాలు తీవ్రంగా దెబ్బతిని తుంటి వరకు తెగిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనను గమనించిన ఆన్ డ్యూటీ రైల్వే సిబ్బంది వెంటనే 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటన స్థలానికి చేరుకున్న వైద్య సిబ్బంది ఆమెను పరిశీలించి మరణించినట్లు ధృవీకరించారు.
మృతురాలి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు, నగదు లేదా రైల్వే టికెట్ లభించలేదు. ఆమె సుమారు 5 అడుగులు 4 అంగుళాల ఎత్తు, ఎరుపు వర్ణం, నల్లటి వెంట్రుకలు, బక్కపలచగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో రెడ్ అండ్ ఆరెంజ్ రంగు చీర, రెడ్ కలర్ జాకెట్ ధరించి ఉండగా, మెడలో పసుపు దారం, చేతులకు బ్రౌన్ రంగు మట్టి గాజులు ధరించి ఉంది. రైల్వే అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఎంజీఎం దవాఖానలో మార్చురీలో భద్రపరిచినట్లు హెడ్ కానిస్టేబుల్ పేర్కొన్నారు. మృతురాలి ఆచూకి తెలిసిన వారు మొబైల్ నెంబర్ 9849749220, 8712658627 సంప్రదించాలని తెలిపారు.