నర్సంపేట రూరల్ : మత్స్యరంగానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఊపిరి పోశారని నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేట మండలంలోని మాధన్నపేట పెద్ద చెరువులో వందశాతం రాయితీపై ఉచిత చేపపిల్లల విడుదల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆదివారం ప్రారంభించారు. ప్రభుత్వం ఉచితంగా అందజేసిన చేప పిల్లలను ఎమ్మెల్యే చెరువులో విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంతటా ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా మాధన్నపేట చెరువులో లక్ష 37వేల చేప పిల్లలను విడుదల చేయడం జరిగిందన్నారు. మత్స్యకారుల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకొని ముందుకు సాగుతుందని తెలిపారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే తెలంగాణలో నీలి విప్లవానికి శ్రీకారం చుట్టడం జరిగిందని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా బ్యాంకర్ల సమావేశంలో ఫిషరిస్ డిపార్టుమెంట్ అధికారికంగా గుర్తించిన మత్స్యకారులు ఇప్పటికే దాదాపు 6,600 మంది పైచిలుకు సభ్యులున్నారని పేర్కొన్నారు. కొత్త సభ్యత్వాలు జిల్లా స్థాయి కమిటీలు మాత్రమే ఇవ్వచ్చని, పాలకవర్గం ఒప్పుకుంటే కొత్త సభ్యత్వాలు సైతం ఇవ్వచ్చని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తెలిపిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. మత్స్యకారుల రైతులకు కేసీసీ కార్డు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని, ఈకార్డు ఇవ్వడం ద్వారా సెంటు భూమిలేని మత్స్యకారులు దాదాపు రూ. 50వేల రుణాన్ని ఎలాంటి జమానతు లేకుండా చేపల పెంపుదల కోసం ఉచితంగా కల్పించే వెసులుబాటు ఉంటుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నామాల సత్యనారాయణ, ఈర్ల నర్సింహరాములు, రాయిడి రవీందర్రెడ్డి, నాయకులు కోమాండ్ల గోపాల్రెడ్డి తదితరులు ఉన్నారు.