హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 1: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ మంగళవారం కాకతీయ యూనివర్సిటీలో బీఆర్ఎస్వీ, పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్, వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి శవయాత్ర నిర్వహించారు. డప్పు చెప్పులతో కేయూ మొదటి గేటు వరకు శివయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా కేయూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విద్యార్థి సంఘాల నాయకులకు, పోలీసుల మధ్య వాగ్వాదంతో కేయూలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ కేయూ ఇంచార్జి జెట్టి రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను 400 ఎకరాలను వేలం వేసి ఇతర ప్రైవేట్ కార్పొరేటు కంపెనీలకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
విద్యార్థులు మా భూములు మాకు కావాలనీ శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే రేవంత్రెడ్డి విద్యార్థులపైన అక్రమంగా లాఠీచార్జి చేపిస్తూ వారిని అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తీరు మానుకొని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు క్షమాపణలు చెప్పి ఆ భూముల జోలికి వెళ్లకుండా ఉండాలని లేదంటే రాష్ర్టవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల్లో పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.