భీమదేవరపల్లి, ఫిబ్రవరి 20 : ఆపన్నులకు చేయూతనందించాలని సర్పంచి బొల్లంపల్లి అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గట్లనర్సింగాపూర్ గ్రామంలో ఒంటికాలిపై నడుస్తూ ఇబ్బంది పడుతున్న దివ్యాంగుడు గూళ్ల రవీందర్కు రిటైర్డ్ టీచర్ గూళ్ల వెంకన్న చంక కర్రలను వితరణ చేయగా సర్పంచ్ అజయ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందిన వాళ్లు సమాజసేవకు పాటుపడాలన్నారు. గ్రామాలు ఆదర్శంగా తీర్చి దిద్దబడాలంటే సీనియర్ సిటిజన్ లు, రిటైర్డ్ ఉద్యోగుల సలహాలు, సూచనలు చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. పల్లెలను అద్దంలా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఆయనతోపాటు వార్డు సభ్యులు సాయిరాం, మత్స్య కార్మిక సంఘం డైరెక్టర్లు గూళ్ల సంపత్, శ్రీనివాస్, పూర్ణ చందర్, కనుకయ్య, మొగిలి, దేవేందర్, రఘుపతి, అంజి తదితరులు పాల్గొన్నారు.