– మిర్చి సాగు తగ్గిస్తేనే రైతులకు ప్రయోజనం
– ఖమ్మం జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి మధుసూదన్
ఖమ్మం రూరల్, ఆగస్టు 06 : ప్రతి నర్సరీకి లైసెన్స్ తప్పనిసరి కలిగి ఉండాలని ఖమ్మం జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి వి.మధుసూదన్ అన్నారు. నర్సరీ సాగు చట్టం 2017పై గురువారం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ రైతు వేదికలో అవగాహన సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్య అతిథిగా డిహెచ్ఎస్ఓ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నర్సరీ యజమానులు, సాగు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులకు నాణ్యమైన మొక్కలను అందించాలని ఉద్దేశంతో 2017లో నర్సరీ యాక్టివ్ తీసుకురావడం జరిగిందన్నారు. ఈ చట్టం ప్రకారం నర్సరీ నిర్వాహకులు విత్తనాల ఎంపిక నుంచి మార్కెటింగ్ వరకు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
నర్సరీ షెడ్లు ఏర్పాటు విత్తన రసీదులు, క్రయవిక్రాలకు సంబంధించిన రికార్డులు, నర్సరీ లైసెన్స్, రెన్యువల్ వివరాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్ట ప్రకారం నర్సరీ యజమానులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ఎల్ నినో ప్రభావం కొనసాగుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో మిర్చి సాగుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగు చేస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఉద్యాన అధికారి పి అపర్ణ, హెచ్ ఇ ఓ విజయలక్ష్మి తోపాటు పలువురు నర్సరీ యజమానులు, సాగు రైతులు పాల్గొన్నారు.