Kuala Lumpur-Kochi flight : విమానం గాల్లో ఉండగానే ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికుల్ని భయభ్రాంతులకు గురిచేసి, ప్రమాదంలోకి నెట్టబోయాడు. ఈ ఘటనకు పాల్పడిన ప్రయాణికుడిని పోలీసులు అరెస్టు చేశారు. బతిక్ ఎయిర్ ఫ్లైట్ ఓడీ231 అనే విమానం కౌలాలాంపూర్ (మలేసియా) నుంచి కేరళలోని కోచి వస్తుండగా బుధవారం ఈ ఘటన జరిగింది. నిందితుడిని కేరళలోని కూటన్నాడ్కు చెందిన జంషీర్ అతనిక్కల్గా గుర్తించారు.
బుధవారం రాత్రి విమానం గాల్లో ప్రయాణిస్తుండగా, రాత్రి 9.30 గంటల నుంచి 11.05 గంటల మధ్య జంషీర్ విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. దీంతో ప్రయాణికులు అందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానం డోర్ తెరవవద్దని ప్రయాణికులు కోరారు. ఇదే సమయంలో విమానం సిబ్బంది అడ్డుకుని, డోర్ తెరవకుండా చేశారు. విమానం రాత్రి 2.40 గంటలకు కోచి ఎయిర్పోర్టులో ల్యాండ్ అయింది. అప్పటికే విమానం సిబ్బంది ఎయిర్పోర్టు అధికారులకు ఈ ఘటన గురించి సమాచారం ఇచ్చారు. దీంతో విమానం ల్యాండ్ అయిన వెంటనే సీఐఎస్ఎఫ్ సిబ్బంది జంషీర్ను అరెస్టు చేశారు. నెడుంబస్సెరి పోలీస్ స్టేషన్కు తరలించారు. అతడిపై బీఎన్ఎస్ సెక్షన్ 351(3)తోపాటు, సెక్షన్ 118(ఈ), స్షెన్ 11ఏ కింద కేసు నమోదు చేశారు. కేసు తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో విమానానికి సంబంధించిన ఒక విండో ప్యానెల్ కూడా ధ్వంసమైంది. దీంతో విమానయాన సంస్థకు చెందిన సిబ్బంది విమానాన్ని తనిఖీలు నిర్వహించారు. అవసరమైన మరమ్మతులు చేశారు. అనంతరం విమానం ప్రయాణానికి సిద్ధంగా ఉందని అధికారులు ప్రకటించారు. అయితే, విమాన సిబ్బంది జోక్యం చేసుకుని, అతడు ఎమర్జె్న్సీ డోర్ తెరవకుండా అడ్డుకోవడం వల్ల ప్రమాదం తప్పిందని ప్రయాణికులు అన్నారు.