చెన్నారావుపేట : సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ పర్యటన సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ ) విద్యార్థి నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు.
ప్రశ్నిస్తున్న విద్యార్థుల నాయకుల పైన అర్ధరాత్రి నుండి అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఇదేనా ప్రజా పాలన అని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ సధిరం వినయ్ భాస్కర్, పట్టణ అధ్యక్షులు దేవోజు హేమంత్, నల్ల రవీందర్ విమర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకు ఇంత భయం, ఇచ్చిన హామీలు నెరవేర్చమని కోరితే.. అక్రమంగా అరెస్టు చేయడమేంటి అని ప్రశ్నించారు. 6 గ్యారెంటీలు హామీ అమలు చేయాలని లేనిపక్షంలో రానున్న రోజుల్లో విద్యార్థులు, నిరుద్యోగులతో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామన్నారు. కేసిఆర్ హయాంలో మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి తెచ్చిన నిధులతోనే శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేస్తున్నారు తప్ప కొత్తగా నర్సంపేట నియోజకవర్గానికి మీరు ఇచ్చిన నిధులు ఎమీ లేవన్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గంలొని పేద విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్ కాలేజీ, సైనిక్ స్కూల్ అన్ని మండల కేంద్రాల్లో SC, BC,ST మైనారిటీ గురుకుల పాఠశాలలు, కళాశాలలు నర్సంపేట పట్టణంలో అన్ని వర్గాల విద్యార్థులకు సంక్షేమ హాస్టళ్లు తీసుకొని వచ్చి నర్సంపేటను ఎడ్యుకేషనల్ హబ్ గా తిర్చిదిద్దిన ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డికే దక్కతుందన్నారు.