హనుమకొండలోని వేయి స్తంభాల దేవాలయంలో గణపతి పూజలు చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వినాయక చవితి పండుగ సందర్భంగా చారిత్రాత్మక వేయిస్తంభాల గుడిలో వినాయకునికి పూజలు నిర్వహించాను.
ప్రతి సంవత్సరం నేను ఈ పూజలో పాల్గొంటాను.
వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాడవాడన వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. వేయిస్తంభాల గుడిలో పూజ అయ్యాకే అన్ని వినాయక మండపాల్లో పూజలు నిర్వహిస్తారు. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా వినాయక ఉత్సవాలను సరిగ్గా నిర్వహించలేదు. అందరిలో చైతన్యం వచ్చింది. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలి.
వేయి స్తంభాల గుడిని ఆధ్యాత్మికంగా వెలుగొందే విధంగా అభివృద్ది చేస్తున్నాం. సీఎం కేసిఆర్ ఆలోచనలతో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతుంది. ఈ ఎనిమిదేళ్ళలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తోంది. అందరూ ఇంట్లోనే మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించండి. మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు’ అని చెప్పారు.