రఘునాథపల్లి, మే 29 : రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండలగూడెంలో శుక్రవారం రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఐకేపీ ఆధ్వర్యంలో మండెలగూడెంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి నెలవుతున్నా 30 శాతం ధాన్యాన్ని మాత్రమే కాంటా వేసి మిల్లులకు తరలించారని రైతులు ఆరోపించారు.
రైతుల ఆందోళనకు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. బీఆర్ఎస్ నాయకుడు చింతల బాలకృష్ణ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి రైతులు ధాన్యం తీసుకొచ్చి నెల రోజులవుతున్నా కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదన్నారు. రోహిణి కార్తె రావడంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించే సమయం ఆసన్నమైందన్నారు. కాంగ్రెస్ సర్కారు పంటల కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తుండడంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే నిరీక్షించాల్సి వస్తున్నదన్నారు. తాలు, తూకం పేరుతో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, మిల్లు యాజమాన్యాలు క్వింటాకు నాలుగు కిలోల వరకు తరుగు తీస్తూ రైతులకు నష్టం చేస్తున్నారని ఆయన తెలిపారు.
బీఆర్ఎస్ పాలనలో సజావుగా ధాన్యం కొనుగోళ్లు జరిగేవని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు నానా కష్టాలు పడుతున్నారని వివరించారు. ఇప్పటికైనా ఆధికారులు స్పందించి రెండు రోజుల్లో ధాన్యం తూకం వేసి మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో బీఆర్ఎస్ నాయకులు తోట నరేశ్, గాదె ఉపేందర్, జయరాం, డ్యాగల ఎల్లయ్య, బోళ్ల అఖిల్, చింతకాయల నరేశ్, పరశురాములు, కనకరాజు, పల్లపు మల్లయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు పుప్పాల వేణు పాల్గొన్నారు.