హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : లాల్దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాంక్షించారు. ఆషాఢమాస బోనాల సందర్భంగా ఆదివారం ఆయన నగరంలోని పలు ఆలయాలను సందర్శించి అమ్మవార్లకు పట్టువస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం నాంపల్లిలోని ఏడుగుళ్ల పోచమ్మను దర్శించుకొని పూజలు చేసిన అనంతరం.. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారిని, అక్కడి నుంచి ఓల్డ్ సిటీలోని బంగారు మైసమ్మ, అక్కన్నమాదన్న మహంకాళీ ఆలయాన్ని, లాల్దర్వాజా సింహవాహిని అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు.
అనంతరం మీరాలం మహంకాళీ అమ్మవారి ఆలయాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి సందర్శించారు. అక్కడి నుంచి అంబర్పేట నియోజకవర్గంలోని మహంకాళీ అమ్మవారి ఆలయం, ముషీరాబాద్ రాంనగర్ డివిజన్లో రేశం మల్లేశ్ నివాసంలో ఏర్పాటుచేసిన పూజల్లో పాల్గొన్నారు. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న కనకాల కట్ట మైసమ్మ దేవాలయం, బల్కంపేట ఎల్లమ్మ ఆలయాలను సందర్శించి అమ్మవార్లకు పూజలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అమ్మవార్ల ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులంతా సంతోషంగా ఉండాలని, హైదరాబాద్లో వ్యాపారాలు బాగా సాగాలని ఆకాంక్షించారు. తనను బోనాలకు ఆహ్వానించిన నిర్వాహకులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఆయనకు ప్రతిచోటా స్థానికులు, అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. యువత, బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సెల్ఫీలు దిగారు.