హనుమకొండ, జూన్ 11 : కమిషన్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ స్వరాష్ర్ట ఉద్యమాన్ని ప్రారంభించి.. ఆ గమ్యాన్ని ముద్దాడి..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన యోధుడు కేసీఆర్ అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా ఏర్పాటు చేసిన కమిషన్ ముందుకి బుధవారం కేసీఆర్ హైదరాబాద్లోని బీఆర్కే భవన్కు హాజరు కాగా, ఆయనకు మద్దతుగా అక్కడికి దాస్యం వినయ్ భాస్కర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లారు.
ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ తాగునీటి, సాగునీటి తండ్లాటను తీర్చిన అపర భగీరధుడు కేసీఆర్ అని అన్నారు. 60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయానికి కనీసం ఒక్క పంటకు నీళ్లు ఇచ్చిన పాపాన పోలేదని, కేసీఆర్ రెండున్నర ఏళ్లలో తాగు, సాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టుల పునరుద్ధరణ, రీ డిజైన్లతో గోదావరి, కృష్ణ నది జలాలను ఒడిసిపట్టి తెలంగాణ మాగాణాలకు తరలించారని కొనియాడారు. తెలంగాణకు సాగు, తాగు నీరు విషయంలో తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చిన కేసీఆర్పై నిందలు మోపడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని అన్నారు.
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల కుట్రలతోనే కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలని, తెలంగాణను మళ్లీ ఎడారిగా చేయాలని చూస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కమిషన్లు కేసీఆర్ను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా ప్రజల హృదయాల్లో ఆయన సాగు, తాగునీటి అవసరాల కోసం చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. ఈ ర్యాక్రమంలో కార్పొరేషన్ మాజీ చైర్మెన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, వరంగల్ పశ్చిమ నియోజక వర్గం కో ఆర్డినేటర పులి రజినీకాంత్, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు బొద్దు వెంకన్న, జానకిరాములు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.