హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వనట్టేనని తేలిపోయింది. ఈ విద్యా సంవతర్సం నుంచి మాత్రమే నిధులు చెల్లిస్తామని సీఎం రేవంత్రెడ్డే స్వయంగా ప్రకటించారు. విద్యార్థుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని చెప్పారు. నెక్లెస్ రోడ్, హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా ఏర్పాటుచేసిన జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే విగ్రహాలను సీఎం శుక్రవారం ఆవిషరించి మాట్లాడారు. ఫీజులు కట్టలేదని యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఆపేందుకు వీల్లేదని తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులు అడుగకుండానే ఖాతాల్లో డబ్బులు వేస్తామన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే ముందుగానే వారి ఖాతాల్లో వేస్తామని, అందుకోసం ఏటా రూ.2,400 కోట్లు చెల్లించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలుచేస్తామని తెలిపారు. విద్యార్థులు చదువు మాత్రమే కాకుండా, సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలని, అప్పుడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కంప్యూటర్ సైన్స్ చదివినా ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదని, ఏఐతో ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్, ఐటీ ఉద్యోగాలు కూడా పోయే ప్రమాదం తలెత్తిందని, ఆ సంక్షోభాన్ని ఎలా ఎదురోవాలో ఆలోచించాల్సిన అవసరముందని వివరించారు. ఫూలే దంపతుల విగ్రహాల ఏర్పాటు కేవలం జయంతి, వర్ధంతులను నిర్వహించేందుకు కాదని, వారి త్యాగాలు, ఔన్నత్యం, స్ఫూర్తికి వేదికలుగా నిలుస్తాయని తెలిపారు.