హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పోలీసుల తీరుపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సామాన్యులు, రాజకీయ ప్రత్యర్థుల విషయంలో తెలంగాణ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని, రాజకీయంగా ప్రభావం ఉన్న వ్యక్తుల కుటుంబసభ్యులకు సంబంధించిన ఆరోపణల విషయంలో భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్లో ఓ మహిళను పోలీసు జుట్టు పట్టి ఈడ్చుకెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా ఈ ఘటనపై కేటీఆర్ శనివారం ఎక్స్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేంద్ర మంత్రి కొడుకుపై పోక్సో కేసు ఆరోపణలు వచ్చినప్పుడు పోలీసులు తొమ్మిది రోజులపాటు స్పందించకుండా ఉన్నారని, అదే సమయంలో ప్రజలు, రాజకీయ ప్రత్యర్థుల విషయంలో మాత్రం అత్యంత దూకుడుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒడిశాకు చెందిన ఓ పేద యువతిని ఎంపీ కొడుకు వాహనంతో ఢీకొట్టి చంపితే పోలీసులు మౌనం వహించారని మండిపడ్డారు. రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తుల కుటుంబాలకు సంబంధించిన కేసుల్లో ఒక రకంగా, సామాన్య ప్రజలు లేదా రాజకీయ ప్రత్యర్థుల విషయంలో మరో రకంగా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై దాడి చేయించేందుకు గూండాలను ప్రత్యేక తాళ్ల బృందాలతో పోలీసులు ఎసార్ట్ కల్పించారని కేటీఆర్ ఆరోపించారు. పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రత్యర్థులపై ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ఈ నెల 7న అసెంబ్లీ వద్ద మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేశారని, వారి జుట్టు, చీరలు లాగారని గుర్తుచేశారు. తమ పార్టీ నేత మన్నె క్రిశాంక్ అరెస్టు వ్యవహారంలో ఆయన బిడ్డను పాఠశాలకు వెళ్లకుండా అడ్డుకొని భయభ్రాంతులకు గురిచేశారని ఆవేదన వ్యక్తంచేశారు.
చిన్నారులు, మహిళల రక్షణ విషయంలో పోలీసు వ్యవస్థ మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. పోలీసు యూనిఫాం ధరించిన అధికారులు.. ప్రజలు, రాజకీయ ప్రత్యర్థుల విషయంలో మాత్రం వీధి గూండాలకు ఏమాత్రం తీసిపోని విధంగా వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పట్టపగలే హత్యలు జరుగుతున్నా, శాంతిభద్రతలు క్షీణించినా ప్రభుత్వం రాజకీయ అంశాల్లోనే నిమగ్నమైందని విమర్శించారు. ప్రజల భద్రత, మహిళల రక్షణ, నేరాల నియంత్రణపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు.