హనుమకొండ, జూన్ 03: హనుమకొండ అంబేద్కర్నగర్ వద్ద డబుల్ బెడ్ రూం బాధితులు ఆందోళన చేపట్టారు. తమకు కేటాయించిన డబుల్ బెడ్ రూంలను తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం తాళాలు పగలగొట్టి ఇంటిలోపలికి వెళ్లారు. తమకు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని బాధితులు బైఠాయించారు. అధికారులు, స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 2015లోనే అంబేద్కర్నగర్లో 53 మందికి, జితేందర్ నగర్లో 64 మందికి కలిపి మొత్తం 117 మందికి ప్రొసీడింగ్స్ ఇచ్చారన్నారు. ప్రొసీడింగ్ ఇచ్చిన అధికారులు ఇప్పటి వరకు ఇండ్లు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలుగా గుడిసెల్లో చెత్త డింపింగ్ యార్డు పక్కన ఉంటున్నామని.. దుర్వాసన, దోమలతో పిల్లలు, వృద్ధులతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్థానిక ఎమ్మెల్యే అర్హులైన నిరుపేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని వాపోయారు. విషయం తెలుసుకున్న సుబేదారి పోలీసులు డబుల్ బెడ్రూం ప్రాంతానికి చేరుకొని బాధితులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. బాధితులు అధికారులు, ఎమ్మెల్యే వచ్చే వరకు ఇక్కడే ఉంటామని భీష్మించి కూర్చున్నారు. రాత్రి వరకు కూడా అధికారులు ఎమ్మెల్యే రాకపోవడంతో అక్కడే ఉండిపోయారు. మాకు డబుల్బెడ్ రూంలు అప్పగించే వరకు ధర్నాను ఆందోళన విరమించమని.. బుధవారం నుంచి మరింత ఉధృతం చేస్తామని బాధితులు స్పష్టం చేశారు. ఆందోళనలో అంబేద్కర్ నగర్, జితేందర్సింగ్ నగర్కు చెందిన సౌరం రఘు, ఎర చంద్రమౌళి, ఓరుగంటి స్వామి, కొయ్యడ కృష్ణ, దరికి రమేశ్, బొచ్చు సరోజన, మోర శిల్ప, వంటేరు కిరీట, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.