Maharashtra : మహారాష్ట్రలో ఒక ఆర్మీ జవాన్ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఏడు నెలల గర్భిణి అయిన భార్యను గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. కానీ, చివరకు నేరం బయటపడి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని వాసిం జిల్లాలో గురువారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధ్యానేశ్వర్ మాడ్నే (28) అనే వ్యక్తి ఆర్మీలోని మరాఠా బెటాలియన్లో పని చేస్తున్నాడు. అతడి భార్య దీపాలి ఏడు నెలల గర్భిణి. ఇటీవల అతడు సెలవుపై ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో భార్య దీపాలితో గురువారం మధ్యాహ్నం గొడవ జరిగింది. దీంతో భార్య గొంతు నులిమి హత్యకు యత్నించాడు.
అప్పటికే ఆమె స్పృహ తప్పి పడిపోయి, కొన ఊపిరితో ఉంది. అయితే, ఆమెను వెంటనే ఒక ప్రైవేటు అంబులెన్స్లో స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. ఆమె పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ప్రమాదవశాత్తు తన భార్య పడిపోయిందని వైద్యులతో చెప్పాడు. కానీ, వైద్యులకు అతడిపై అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆమె మెడపై గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గొంతునులిమినట్లుగా గాయాలున్నాయి. దీంతో వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈలోపు మధ్యాహ్నం 3.00 గంటలకు దీపాలి కుటుంబ సభ్యులకు ధ్యానేశ్వర్ సమాచారం అందించాడు. దీపాలి ఇంట్లో పడిపోయిందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పాడు. మధ్యప్రదేశ్లో ఉంటున్న వారు సాయంత్రం ఆస్పత్రికి వచ్చి చూసేసరికి దీపాలి మరణించింది. అప్పటికే ఈ ఘటనపై వైద్యుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ధ్యానేశ్వర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మహిళ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ధ్యానేశ్వర్కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయంలో భార్యాభార్తల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోందని చెప్పారు. అతడి వివాహేతర సంబంధం కారణంగా తమ సోదరి దీపాలిని అతడు తీవ్రంగా వేధించేవాడని ఆమె సోదరుడు రాహుల్ చెప్పాడు. దీంతో కొద్ది రోజుల క్రితం ఇరు కుటుంబాల వాళ్లు కూర్చుని, అతడికి నచ్చజెప్పినట్లు వెల్లడించారు. అయితే, ఆ తర్వాత నుంచి మళ్లీ దీపాలిని వేధించేవాడని పోలీసులకు తెలిపారు. ఈ అంశంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. భర్త ధ్యానేశ్వర్ను అరెస్టు చేశారు. అతడితోపాటు అత్తామామలపై కూడా హత్య కేసు నమోదు చేశామమని పోలీసులు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు.