నెక్కొండ, జూన్ 8 : ప్రస్తుతం నేను ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని అవకాశం ఉన్నందున వర్షాలను అనుసరిస్తూ రైతులు పంటల సాగు ప్రణాళికలు రూపొందించుకొని పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ గ్రామ సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు సరిగా పడకపోతే జూలై నెల వరకు పరిస్థితిని గమనించి తక్కువ సాగునీటితో పండించే పంటల సాగు వైపు రైతులు మొగ్గు చూపాలన్నారు.
అధిక నీటి అవసరం ఉండే వరి పంటకు బదులుగా రైతులు తక్కువ నీటితో సాగయ్యే పప్పు ధాన్యాల పంటలను సాగు చేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రణాళికలకు అనుగుణంగా పంటలను సాగు చేపడితే రైతులు నష్టాలను తగ్గించుకొని మెరుగైన ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. సేంద్రియ వ్యవసాయంతో భూమి ఆరోగ్యం మెరుగు పడడమే కాకుండా ప్రజల ఆరోగ్యం పరిరక్షించబడుతుందన్నారు. కార్యక్రమంలో సీఈవో రామ్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, ఎంపీడీవో లావణ్య, ఎస్ఐ మహేందర్, ఏవో నాగరాజు, పంచాయతీ కార్యదర్శి సదానందం పాల్గొన్నారు