వర్ధన్నపేట, మార్చి 10 : డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం అని నార్కోటిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద, కట్య్రాల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, డ్రగ్స్ నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో కేవలం అభివృద్ధి పనులే కాకుండా, రేపటి పౌరులైన విద్యార్థుల భవిష్యత్తును కాపాడటం మా బాధ్యత అన్నారు.
గ్రామాలలోని ప్రతి పాఠశాల డ్రగ్స్ రహితంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు అలవాటుపడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. ఎవరైనా మత్తుపదార్థాలు తీసుకున్నా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎస్ఐ సాయిబాబు, సర్పంచ్ బేతి సాంబయ్య, ఉప సర్పంచ్ బొచ్చు జ్యోతి, కార్యదర్శి రామారావు, డాక్టర్ సురేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.