వరంగల్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : చారిత్రక నగరంగా ప్రసిద్ధి పొందిన వరంగల్కు తెలంగాణలో సరికొత్త గుర్తింపు వస్తున్నది. మొదటినుంచీ విద్యాకేంద్రంగా ఉన్న నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం హెల్త్హబ్గా అభివృద్ధి చేస్తున్నది. అన్ని వైద్య సంస్థలను ఇక్కడే ఏర్పాటుచేస్తూ హెల్త్ సిటీగా తీర్చిదిద్దుతున్నది. అలాగే విద్య, వైద్య వసతులతో పాటు ఆహ్లాదాన్ని పెంచే ఏర్పాట్లు చేస్తుండడంతో వరంగల్ క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మారుతున్నది. సీఎం కేసీఆర్ తలపెట్టిన తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో ఎనిమిదేండ్లలో నగరం పచ్చదనంతో కళకళలాడుతున్నది. ఎక్కడ చూసినా పార్కులే కనిపిస్తున్నాయి. గ్రేటర్లో ఇప్పటికే పూర్తయిన 44 పట్టణ ప్రకృతి వనాలు నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
సీఎం కేసీఆర్ తలపెట్టిన తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో వరంగల్ నగరంలో ప్రత్యేకంగా పచ్చదనం పెంపునకు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పుడు ప్రతి డివిజన్లో ప్రత్యేకంగా పార్కులు ఏర్పాటయ్యాయి. నగరవాసులకు ఆహ్లాదం పంచుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన గ్రీన్ బడ్జెట్తో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పచ్చదనం రోజురోజుకూ పెరుగు తున్నది. గ్రీన్ బడ్జెట్గా ఉన్న రూ.19 కోట్ల నుంచి నర్సరీలు ఏర్పాటు చేశారు. నగరమంతా పచ్చగా ఉండేలా అనువైన ప్రతిచోటా మొక్కలు నాటుతున్నారు. అడిగిన ప్రతి ఒక్కరికీ మొక్కలు అందిస్తున్నారు.
50వేల మొక్కలతో నర్సరీలు
గ్రేటర్ వరంగల్లో పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రణాళిక రూపొందిస్తున్నది. ప్రతి ఇంటిలో మొక్కల పెంపకంతో పాటు నగరమంతా పచ్చదనం ఉండేందుకు అవసరమైన మొక్కలను పెంచుతున్నది. ఇందుకోసం మూడు డివిజన్లకు ఒకటి చొప్పున నర్సరీలు ఏర్పాటు చేశారు. ఇలా మహానగరంలో 22 నర్సరీలు ఉన్నాయి. 50వేల మొక్కలను పెంచేలా ప్రతి నర్సరీలో వసతులు ఉన్నాయి. ప్రతి నర్సరీకి ప్రహరీ గోడలు ఉన్నాయి. వానకాలంలో మొక్కలు నాటే సమయానికి అవి సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎండకాలంలో మొక్కల సంరక్షణ కోసం గ్రీన్ షెడ్స్ ఏర్పాటు చేశారు.
ఎటుచూసినా పచ్చదనమే..
ఎనిమిదేండ్లలో వరంగల్ నగరం పచ్చదనంతో పూర్తిగా మారిపోయింది. పార్కుల సంఖ్య బాగా పెరిగింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లోని 24 పాత పార్కులను తాజాగా అందంగా తీర్చిదిద్దారు. వాటిలో వసతులు కల్పించారు. వీటికి తోడు జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో కొత్తగా ఐదు పార్కులను ఏర్పాటు చేశారు. శ్రీనగర్కాలనీ, ప్రగతినగర్, మిలీనియం బ్యాంక్ కాలనీ, క్రిస్టియన్కాలనీలలో అభివృద్ధి చేసిన పార్కులను ప్రారంభించారు. సుభాష్నగర్(ఉర్సు)లో అభివృద్ధి చేసిన పార్కు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. మరో కోటిన్నర రూపాయలతో రంగశాయిపేటలో మంకీఫుడ్ కోర్టును అభివృద్ధి చేశారు. ఈ పార్కుల్లో అన్ని వసతులున్నాయి. వాకింగ్ ట్రాక్, పిల్లలు ఆడుకునే వస్తువులు, ఓపెన్జిమ్ వంటి ఏర్పాటుచేశారు.
పట్టణ ప్రకృతి వనాలు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్లో ఒక ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు జీడబ్లూఎంసీ ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికి 44 పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటు పూర్తయ్యింది. పట్టణ ప్రకృతి వనాల్లో వాకింగ్ ట్రాక్, గ్రీనరీతో అందంగా తీర్చిదిద్దారు.