Rajnath Singh : రక్షణ మంత్రి (Defence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) పాకిస్థాన్ (Pakistan) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పీవోకే (POK) పైన మినహా పాకిస్థాన్తో భవిష్యత్తులో మరే అంశంపైన చర్చలు ఉండవని అన్నారు. భారత్ ఇన్నోవేషన్, స్టార్టప్లు, స్పేస్ మిషన్ల వైపు అడుగులు వేస్తుంటే.. పాకిస్థాన్ మాత్రం చొరబాటు మార్గాలను వెతుక్కుంటోందని ఎద్దేవా చేశారు. మనం డేటా సెంటర్లను నిర్మిస్తుంటే.. వాళ్లు ఉగ్రవాద కేంద్రాలను అభివృద్ధి చేసుకుంటున్నారన్నారు.
పాకిస్థాన్తో చర్చలంటూ జరిగితే అది పీవోకే కోసమే తప్ప మరే విషయంలోనూ జరగబోవని పేర్కొన్నారు. పీవోకేను పాక్ అక్రమంగా ఆక్రమించుకుందని మండిపడ్డారు. కార్గిల్ విజయ్ దివస్ను పురస్కరించుకొని యుద్ధ స్మారక చిహ్నం వద్ద మాట్లాడుతూ కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. 1999లో కార్గిల్ యుద్ధంలో దేశం సాధించిన విజయాన్ని భారతమాత కిరీటంలో పొదిగిన వజ్రంగా అభివర్ణించారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని తమ దేశ విధానంలో ఒక భాగంగా మార్చుకుందని రాజ్నాథ్ సింగ్ దుయ్యబట్టారు.
ఉగ్రవాదులను అడ్డు పెట్టుకొని భారత్ను బెదిరించడానికి ప్రయత్నిస్తే ఏమవుతుందో ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రపంచమంతా చూసిందన్నారు. పాక్ చేసే ఏ దుస్సాహస చర్యకైనా వారి ఊహకందని రీతిలో మన సైన్యం ప్రతిస్పందిస్తుందన్నారు. ఉరి సెక్టార్ దాడి తర్వాత జరిపిన సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా తర్వాత వైమానిక దాడులు, పహల్గాం దాడుల అనంతరం ఆపరేషన్ సిందూర్.. ఇలా ఉగ్రవాద చర్యలపై భారత్ తీవ్రంగా స్పందించిందని గుర్తుచేశారు. 27వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాజ్నాథ్ సింగ్తోపాటు ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఇతర ఆర్మీ అధికారులు అమరవీరులకు నివాళులర్పించారు.