స్టేషన్ ఘన్పూర్, డిసెంబర్ 4 : ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును నాడు అడ్డుకున్న పార్టీలు, శక్తులు, సమైక్యవాదులుగా ముద్ర పడినవారు తెలంగాణపై మరోసారి దాడి చేసేందుకు యత్నిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్ర ప్రగతిని చూసి ఓర్వలేకే దండయాత్ర చేస్తున్నారని విమర్శించారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడారు. ఆరు దశాబ్దాల ప్రజల ఆకాంక్ష, అమరుల త్యాగ ఫలం, ఉద్యమ నేత సీఎం కేసీఆర్ పోరాటంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని ఆయన వివరించారు. ఉద్యమ నేత ముఖ్యమంత్రి కావడంతో రాష్ట్రం అన్నిరంగాల్లో ప్రగతి సాధిస్తున్నదన్నారు. ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు జరుగుతూ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇక్కడి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేని బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్టీపీ లాంటి పార్టీలు దండయాత్ర చేస్తున్నాయన్నారు.
తద్వారా అలజడిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని, అభివృద్ధిలో నంబర్వన్గా నిలిచి దేశంలోనే గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణను అప్రతిష్టపాలు చేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. దీనిని తెలంగాణ ప్రజలు గమనించాలని ఆయన కోరారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ద్వారా మాత్రమే తెలంగాణ హక్కులు కాపాడబడుతాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు. ‘చాలా మంది వస్తుంటారు.. పోతుంటారు, కాలక్షేపం కోసం రాజకీయం చేస్తుంటారు, అలాంటి వారిని కూడా గమనించాలి..’ అని శ్రీహరి అన్నారు. రాజకీయాల్లోనూ పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారని, ఎవరో వదిలి బాణం తెలంగాణపై దాడి చేయడమే గాక విమర్శలు చేస్తున్నదని శ్రీహరి మండిపడ్డారు. గ్రామాల్లో ప్రజల మద్దతు లేనివారు రాజకీయం చేయాలని చూస్తున్నారని, వీరి రాజకీయాలను తిప్పికొట్టాలని ఆయన కోరారు. కేంద్రంలోని బీజేపీ పాలకులు అడుగడుగునా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. బీజేపీలో చేరకుంటే ఈడీ, ఐటీ, సీబీఐ సంస్థలతో దాడులు చేయిస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ షర్మిల పార్టీలు తెలంగాణను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. సమైక్య రాష్ర్టానికి నాడు వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో చీలిక తీసుకొచ్చింది వాస్తవం కాదా అన్నారు. తెలంగాణ ఉద్యమంపై ఉక్కుపాదం మోపి అనేక మంది ఉద్యమకారులను పొట్టన పెట్టుకుని, అనేక మందిపై కేసులు మోపి వారిని జైలు పాల్జేసింది నిజం కాదా అని కడియం శ్రీహరి ప్రశ్నించారు. జలయజ్ఞం పేరుతో వేల కోట్ల ప్రజాదనాన్ని స్వాహా చేసి రాజసౌధాలు నిర్మించుకున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్రెడ్డి, షర్మిల ముమ్మాటికీ తెలంగాణ ద్రోహులే అని ఆయన స్పష్టం చేశారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న వీరు తెలంగాణలో పాదయాత్రల పేరుతో రాజకీయం చేస్తున్నారని కడియం శ్రీహరి విమర్శించారు. తెలంగాణను అడ్డకున్న మీకు ఇక్కడ పాదయాత్ర చేసే హక్కు ఎక్కడిదని ఆయన నిలదీశారు. ‘తన సోదరుడు వైస్ జగన్మోహన్ రెడ్డిపై షర్మిలకు కోపం ఉండొచ్చు.. అన్న అధికారంలోకి రావడానికి పాదయాత్రలు చేసినా నేడు ఆమెను పట్టించుకోవడం లేదు, తనకు రాజకీయ అవకాశాలు ఇ వ్వడం లేదని భావించిన షర్మిల ఆంధ్రాలో పాదయాత్ర చేసుకోవాలి..’ అని హితవు పలికారు. తెలంగాణ ప్రజలు షర్మిలను ఆదరించరని, ఒకప్పుడు లక్ష్మీపార్వతి రాజకీయాల్లో వచ్చి ఏం చేశారో అందరికీ తెలుసు.. ఆమెకు పట్టిన గతే షర్మిలకు పడుతుందని శ్రీహరి హెచ్చరించారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో అభివృద్ధి పనులు జరుగుతూ రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్తుంటే దీనిని ఓర్వలేని కొన్ని పార్టీలు రాజకీయ పబ్బం గడుపుకునేందుకు అలజడి సృష్టించేందుకు యత్నిస్తున్నాయని, దీనిని తీవ్రంగా ఖండించాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని, దయచేసి చిన్న చిన్న విభేదాలు, కోపాలతో తప్పటగులు వేస్తే నష్టపోయేది మన రాష్ట్రమేనని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చి అందరూ అండగా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు చింతకుంట్ల నరేందర్రెడ్డి, బెలిదె వెంకన్న, సేషన్ఘన్పూర్, చిల్పూరు మండలాల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పోగుల సారంగపాణి, మామిడాల లింగారెడ్డి, ఎంపీటీసీలు బూర్ల లతాశంకర్, రజాక్యాదవ్, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు నీల గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.