దేవరుప్పుల, నవంబర్ 23: గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేశామని, ఈ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి ప్రజలను కోరారు. గురువారం మండలంలోని రామరాజుపల్లి, నీర్మాల, సింగరాజుపల్లి, చౌడూరు, మాదాపురం, ధర్మగడ్డ తండా, ధరావత్ తండా, పెదమడూరు, సీతారాంపురం గ్రామాల్లో ఆయన రోడ్ షోలు నిర్వహించారు. ఎర్రబెల్లి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలువగా ఘన స్వాగతం పలికారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకులు అహంకారంతో మాట్లాడుతున్నారని, వారు అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామంటున్నారని తెలిపారు.
వ్యవసాయానికి 3 గంటలు కరెంట్ చాలని చెబుతున్న కాంగ్రెస్కు ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులతో తాను ఘన విజయం సాధిస్తానన్నారు. మేకపోతు గాంభీర్యంతో రేవంత్రెడ్డి టీమ్ ఫోజులు కొడుతున్నదన్నారు. నా పై పోటీకి ఎవరూ ముందుకు రాకపోవడంతో అడ్రస్ లేని అమెరికా నుంచి వచ్చిన యువతిని బరిలో నిలిపారని ఎద్దేవా చేశారు. ‘మీ దయన్న 40 ఏండ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నడు.. అవినీతి నా ఇంటా వంటా లేదు. పాలకుర్తి ప్రజలు వరుసగా మూడు సార్లు గెలిపించారు.. ఈ సారి కూడా ఘన విజయం అందిస్తారు..’ అని ఎర్రబెల్లి అన్నారు. ఒడిపోతే అమెరికాకు ఉడాయించే వారికి ఓటేసేంత అమాయకులు ఈ ప్రాంత ప్రజలు కాదన్నారు. సీఎం కేసీఆర్ మంజూరు చేసిన 10 వేల ఇండ్లను మళ్లీ గెలిచాక అడిగిన ప్రతి కుటుంబానికి మంజూరు చేస్తానని, సొంత స్థలాల్లో నిర్మించుకోండని ఆయన సూచించారు. గ్రామాల్లో సమస్యగా ఉన్న కోతులను పట్టి అడవుల్లో వదిలేసే కార్యక్రమాన్ని చేపట్టామని, దీనిని త్వరలోనూ పూర్తి చేయిస్తామన్నారు.
ఎన్నికల ప్రచారానికి గ్రామాలకు వెళ్లిన ఎర్రబెల్లికి వేలాదిగా తరలివచ్చిన ప్రజలు నీరాజనాలు పలికారు. నీర్మాలలో వందలాది మంది రోడ్షోలో పాల్గొనగా గులాబీమయమైంది. బీఆర్ఎస్ యువత భైక్ ర్యాలీతో ఎర్రబెల్లికి స్వాగతం పలుకగా, మహిళలు కోలాటం, బతుకమ్మలు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. సింగరాజుపల్లిని మండల కేంద్రం చేయాలని స్థానికులు కోరగా ఎర్రబెల్లి హామీ ఇచ్చారు.