సుబేదారి, జూలై 7 : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సభకు మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్లో శుక్రవారం సీపీ మాట్లాడుతూ.. సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శనివారం నిర్వహించనున్న నరేంద్రమోదీ సభ, వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు మూడంచెల భద్రత ఉంటుందన్నారు. ముందుభాగంలో ఎస్పీజీ, తర్వాత కేంద్ర పారా మిలటరీ బలగాలు, ఆ తర్వాత స్థానిక పోలీసులు విధుల్లో ఉంటారని చెప్పారు. ఇద్దరు డీఐజీలు, సీపీ, పదిమంది ఎస్పీలు, 15మంది అడిషనల్ ఎస్పీలు, 32మంది ఏసీపీలు, 56మంది ఇన్స్పెక్టర్లు, 250మంది ఎస్సైలు, సిబ్బంది మొత్తం 3,500 మంది విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. నగరంలో ఇతర సభలు, సమావేశాలకు అనుమతి లేదని, ఎవరూ డ్రోన్లు ఎగుర వేయకూడదని హెచ్చరించారు. హెలిప్యాడ్ భద్రత ఇన్చార్జిగా క్రైమ్ డీసీపీ మురళీధర్, ట్రాఫిక్ పర్యవేక్షణ అధికారిగా ఈస్ట్జోన్ డీసీపీ కరుణాకర్ను నియమించామన్నారు. పాస్లతో నిర్దేశించిన ప్రాంతాల్లోనే అధికారులు, మీడియా ప్రతినిధులు ఉండాలని సీపీ సూచించారు. అలాగే టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించే టౌన్ప్లానింగ్ పరీక్షకు అభ్యర్థులు 8గంటల్లోపే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఎక్కడైనా పోలీసులు అభ్యతరం తెలిపితే హాల్టికెట్ చూపించాలని సీపీ సూచించారు.
ట్రాఫిక్ డైవర్షన్..
ప్రధాని పర్యటన సందర్భంగా శనివారం వరంగల్ నగరంలో ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందని డీసీపీ కరుణాకర్ తెలిపారు. హనుమకొండ అదాలత్ నుంచి కలెక్టరేట్ వరకు ఉదయం నుంచి వాహనాల రాకపోకలకు అనుమతి లేదన్నారు. వాహనాల్లో సభకు వచ్చే బీజేపీ శ్రేణులు నిర్దేశించిన ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. సమావేశంలో డీసీపీలు మురళీధర్, భారీ, ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ పాల్గొన్నారు.
కాజీపేటలో ఆర్పీఎఫ్ తనిఖీలు..
కాజీపేట : కాజీపేట రైల్వే జంక్షన్ పరిసరాలతో పాటు అయోధ్యపురంలోని రైల్వే వ్యాగన్ పరిశ్రమ శంకుస్థాపన చేసే ప్రాంతంలో ఆర్పీఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. శనివారం ప్రధాని రైల్వే వ్యాగన్ పీవోహెచ్, వ్యాగన్ పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో బాంబ్, డాగ్ స్క్వాడ్, ఆర్ఫీఎఫ్, జీఆర్పీ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ సీఐబీ రవిబాబు, కాజీపేట, రామగుండం ఆర్పీఎఫ్ సీఐలు సంజీవరావు, సురేశ్గౌడ్ పాల్గొన్నారు.