రైతులు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. విత్తనాలు నాటినప్పటి నుంచి మొదలుకొని పంట కోసి విక్రయించే వరకు వెన్నంటి ఉంటున్నది. ఏటా రెండు దఫాలుగా రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తున్నది. సంవత్సరం క్రితం నుంచి గోడౌన్ల నిర్మాణంపై దృష్టి సారించింది. అన్నదాతలు తమ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకొనేందుకు జిల్లాలో 45 వేల టన్నుల సామర్థ్యంతో గిడ్డంగుల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రూ.39 కోట్లు మంజూరు చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధికారులు ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. ఒక్కో గోడౌన్ కోసం ఐదేసి ఎకరాలను కేటాయించారు. ఇప్పటికే 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గిడ్డంగుల నిర్మాణం పూర్తి కాగా, మరో మూడింటి పనులు తుది దశకు చేరుకున్నాయి. రెండు మూడు నెలల్లో 25వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్లను అందుబాటులోకి తెస్తామని అధికారులు తెలిపారు.
– వరంగల్, ఫిబ్రవరి 12(నమస్తేతెలంగాణ)
వరంగల్, ఫిబ్రవరి 12(నమస్తేతెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తున్నది. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. సమైక్య పాలనలో దండుగన్న వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో పండుగలా మార్చింది. వ్యవసాయరంగానికి 24 గంటలు నాణ్యమైన ఉచిత కరంటు సరఫరా చేస్తున్నది. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చేసింది. కోటి ఎకరాల మాగాణి లక్ష్యాన్ని అధిగమించి ఇంకా సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులను పరుగెత్తిస్తున్నది. వడ్డీ వ్యాపారుల పీడ వదిలించేందుకు రైతుబందు పథకాన్ని అమల్లోకి తెచ్చింది. పంట పెట్టుబడి కోసం రైతులకు ఎకరానికి ఏటా రూ.10 వేల ఆర్థికసాయం అందజేస్తున్నది. ప్రతి సంవత్సరం వానకాలం, యాసంగి ధాన్యాన్ని మద్దతు ధరతో నేరుగా కొనుగోలు చేస్తున్నది.
ఈ క్రమంలో రైతులు పండించిన పంట ఉత్పత్తుల నిల్వ కోసం పెద్ద ఎత్తున గిడ్డంగులను నిర్మిస్తున్నది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉద్యమంలా సాగుతున్నది. దీంతో ప్రతి జిల్లాలో వేలాది మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కూడిన గిడ్డంగులు అందుబాటులోకి వస్తున్నాయి. గతంలో ఆయా జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చెందిన గోదాములు ఒకటి రెండు ఉండేవి. అవి కూడా 2500 లేదా 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కూడినవి. కొన్నేళ్ల నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఒక్కోచోట 5 నుంచి 10 వేల మెట్రిక్ టన్నుల కెపాసిటీతో గిడ్డంగులను నిర్మిస్తున్నది. జిల్లాలోనూ ఏడాది క్రితం వేర్వేరు చోట్ల సుమారు రూ.39 కోట్ల అంచనా వ్యయంతో 45 వేల మెట్రిక్ టన్నుల కెపాసిటీతో 5 గిడ్డంగుల నిర్మాణం చేపట్టింది.
అవి ఎక్కడంటే..
దుగ్గొండి మండలం చలపర్తి, నర్సంపేట మండలం బానోజీపేట, నల్లబెల్లి మండలం గుండ్లపహాడ్, అర్శనపల్లి, నెక్కొండ మండలం పెద్దకోర్పోలు గ్రామం వద్ద గిడ్డంగుల నిర్మాణం కోసం అధికారులు ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. ఒక్కో గ్రామంలో గిడ్డంగుల నిర్మాణం కోసం ఐదేసి ఎకరాలను కేటాయించారు. చలపర్తి, బానోజీపేట, గుండ్లపహాడ్, పెద్దకోర్పోలు గ్రామాల వద్ద 10 వేల మెట్రిక్ టన్నులు, అర్శనపల్లి గ్రామం వద్ద ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గిడ్డంగుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చలపర్తి వద్ద ఐదేసి వేల టన్నుల కెపాసిటీతో రెండు గిడ్డంగుల నిర్మాణానికి రూ.8 కోట్లు, బానోజీపేట వద్ద కూడా ఐదేసి వేల టన్నుల కెపాసిటీతో రెండు గిడ్డంగుల నిర్మాణానికి రూ.8 కోట్ల చొప్పున మంజూరు చేసిం ది.
పెద్దకోర్పోలు వద్ద ఐదేసి వేల టన్నుల కెపాసిటీతో కూడిన రెండు గిడ్డంగుల నిర్మాణానికి రూ.9 కోట్లు, గుండ్లపహాడ్ వద్ద ఐదేసి వేల కెపాసిటీతో రెండు గిడ్డంగుల నిర్మాణం కోసం రూ.9 కోట్లు, అర్శనపల్లి వద్ద ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఒక గిడ్డంగి నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గత ఏడాది చలపర్తి, బానోజీపేట, గుండ్లపహాడ్, పెద్దకోర్పోలు గ్రామాల వద్ద గిడ్డంగుల నిర్మా ణ పనులను చేపట్టింది. 5 వేల టన్నుల సామర్థ్యం గల ప్రతి గిడ్డంగిని 30 వేల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నది. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఈ గిడ్డంగుల నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పనుల పురోగతిపై అధికారులతో రివ్యూ చేయడంతో పాటు పలుమార్లు గిడ్డంగులను సందర్శించారు.
రెండింటి నిర్మాణం పూర్తి..
చలపర్తి, బానోజీపేట గిడ్డంగుల నిర్మాణం పూర్తయింది. ఇక్కడ ఒక్కోచోట పదేసి వేల టన్నుల కెపాసిటీ గిడ్డంగులతో పాటు వీటిలో ఒక వే బ్రిడ్జి, క్యాబిన్గది, ఆఫీస్ రూం, పార్కింగ్ షెడ్, ప్రహరీ, దీనిపై మూడు వరుసల ఫెన్సింగ్ నిర్మించింది. చలపర్తిలోని పది వేల మెట్రిక్ టన్నుల కెపాసిటీ గిడ్డంగుల్లో ఇటీవల ధాన్యం నిల్వ చేయడం కూడా మొదలైంది. నిర్మాణ పనులు పూర్తి కావడంతో బానోజీపేటలోని గిడ్డంగులను మరో పది వేల టన్నుల ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులను నిల్వ చేయడానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ సిద్ధం చేసింది. గుండ్లపహాడ్, అర్శనపల్లి, పెద్దకోర్పోలులో గిడ్డంగుల నిర్మాణ పనులు తుది దశకు చేరాయి.
అర్శనపల్లి గిడ్డంగి రూఫింగ్ కూడా పూర్తయింది. గుండ్లపహాడ్, పెద్దకోర్పోలులోని గిడ్డంగుల రూపింగ్ పనులు జరుగుతున్నాయి. మరో రెండు మూడు నెలల్లో నిర్మాణ పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. వీటి నిర్మాణం పూర్తయితే మరో 25 వేల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులను నిల్వ చేసేందుకు గిడ్డంగులు అందుబాటులోకి రానున్నాయి. గతంలో జిల్లాలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన గిడ్డంగి ఒక్కటి కూడా లేదు. తెలంగాణ ప్రభుత్వం జిల్లాలో ఐదుచోట్ల ఒకేసారి 45 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గిడ్డంగుల నిర్మాణం చేపట్టడం విశేషం.