Rythu Bandhu | ఈ ఏడాది యాసంగి సాగుకు రైతుబంధు సాయం పంపిణీ అయోమయంగా మారింది. సీజన్ మొదలైనా ఇంకా సగం భూమికి పంట పెట్టుబడి అందకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకాలంలో పెట్టుబడి సాయం అందడంతో అప్పుల కోసం ఎదురుచూడకుండా అన్నదాత ఉత్సాహంగా పంటలను సాగు చేసుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం సీజన్ దాటుతున్నా సాయం అందకపోవడంతోపాటు మరోవైపు అప్పులు దొరకక ఆగమాగమవుతోంది. ఇప్పటి వరకు మూడెకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే రైతుబంధు పైసలు జమ కాగా, మిగతా రైతాంగం ఎప్పుడెప్పుడు తమ ఖాతాల్లో డబ్బులు పడుతాయోనని ఆశగా ఎదురుచూస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కర్షక లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
అన్నదాతలకు సాగు కష్టాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దేశంలోనే సంచల నాత్మక రీతిలో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని నూతన పుంతలు తొక్కించారు. ఈ క్రమంలో తొమ్మిదేళ్లపాటు ప్రతి పంట సీజన్కు ఒకసారి ఏడాదికి రెండు సార్లు రైతుబంధు సాయాన్ని రైతులకు క్రమం తప్పకుండా అందించారు. అయి తే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తాము అధికారంలోకి వస్తే ఏటా ఎకరాకు రూ.15వేల చొప్పున రైతుబంధు సాయం అందిస్తామని ప్రకటించింది. అయితే ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రస్తుతం పాత పద్ధతిలోనే రైతులకు డబ్బులను జమ చేయాలని ఆదేశించారు. అప్పటి నుంచి రైతులు డబ్బుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. తొలిరోజు మాత్రం ఊరిస్తూ హనుమకొండ జిల్లాలో 1.52 లక్షల రైతులకు గాను 20గుంటల వరకు ఉన్న 58,286మంది రైతులకు బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. దీంతో తమ బ్యాంక్ అకౌంట్లలో చకచకా డబ్బులు పడుతాయని రైతులు ఆశించారు. ఆ తర్వాత మరో పది రోజులకు ఇంకో 45వేల మంది రైతులకు రెండు ఎకరాల వరకు డబ్బులు ఇచ్చారు.
మిగతా డబ్బులు మాత్రం రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు అతీగతీ లేదు. రైతుబంధు పథకానికి అర్హులుగా ఉన్న సుమారు 65వేల మంది రైతులు రైతుబంధు డబ్బుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. యాసంగి పంటలు నాటు కోవడం పూర్తయ్యి పంట కాలం దాదాపుగా సగానికి వచ్చింది. అయినా ఇప్పటి వరకు రైతుబంధు డబ్బులను మాత్రం ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా రైతాంగానికి రూ.186కోట్ల పైచిలుకు డబ్బులు అందాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ. 70 కోట్ల వరకే అందినట్లుగా వ్యవసాయశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో హలధారు ల్లో ఆందోళన నెలకొంది. గత ప్రభుత్వంలో సమయానికి రైతుబంధు డబ్బులు వస్తే పెట్టుబడికి ఎలాంటి ఇబ్బంది ఉండేది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 3నె లలు కావసున్నా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. కాంగ్రెస్ చేసిన తప్పుడు వాగ్దానాల నుంచి మోసపోయామని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎకరాకు రూ.15వేల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
ములుగు జిల్లాలో 84,103మంది రైతుల ఖాతాల్లో రూ. 88.19 కోట్లు జమ కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 62,466మంది రైతులకు రూ.44.81కోట్లు మాత్రమే జమ అయ్యాయి. మిగిలిన రైతులకు మరో రూ.47కోట్లు అందాల్సి ఉండగా ప్రభుత్వం ఎప్పుడు జమ చేస్తుందా.. అని రైతులు ఎదురు చూస్తున్నారు. పంట పెట్టుబడుల కోసం రైతులు అప్పులు తెచ్చి యాసంగి సాగు చేపడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 2,14,685 మంది రైతులకు రూ. 233.07 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 1,63,090 మంది రైతులకు రూ. 110.99 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో జమయ్యాయి. ఇంకా 51,595 మంది రైతులకు రూ.122.08 కోట్లు ఖాతాలో పడాల్సి ఉంది. పంట పెట్టుబడి డబ్బులు అందకపోవడంతో ఎకువ వడ్డీకి అప్పులు తెస్తుండడంతో రైతుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఎప్పుడు వేస్తుందా అని ఎదురుచూస్తుండగానే సగం పంట కాలం అయిపోయింది. బీఆర్ఎస్ సర్కారుల రైతులకు పెట్టుబడిసాయం సమయానికి అందేది. అప్పులు చేయాల్సిన అవసరం వొచ్చేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల వరకే పరిమితమైంది. రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి ఎకరాకు రూ.15వేలు ఇస్తామన్న సీఎం రేవంత్రెడ్డి కనీసం ఇప్పటి వరకు రూ.10వేలు కూడా పెట్టుబడి సాయం ఇయ్యలే. పూర్తి స్థాయిలో రైతుబంధు డబ్బులు ఎప్పుడు జమ చేస్తారోనని రైతులు ఎదురుచూస్తున్నారు.
కాంగ్రెస్ సర్కారు రైతుబంధు పైసలియ్యకపోవడంతో పెట్టుబడికి తిప్పలైతాంది. ఆ పార్టీ అధికారంలోకి వస్తే రూ.15వేలు ఇస్తదనుకుంటే అసలుకే మోసం వచ్చింది. యాసంగి నాట్లేసి చాలా రోజులైతు న్నా ఇంతవరకు రైతుబంధు ఇ య్యలే. కేసీఆర్ ప్రభుత్వం సంక్రాతి వరకే మా ఖాతాల్లో డబ్బు లు వేసేది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు నెలలైనా పైసలు ఇయ్యలే. డిసెంబర్ 9 నాడే ఇస్తనని చెప్పి మాట తప్పింది. డబ్బుల కోసం వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. పెట్టుబడి కోసం గోసపడక తప్పడం లేదు.
పంట పెట్టుబడికి రైతు బంధు పైసలు రాకపోవడంతో చిట్టి ఎత్తుకుని పంట వేశా. ఆ పైసలకు వడ్డీ కట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మేలు చేయదల్చుకోలె. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుబంధు పైసలు టైముకు వేసేటోడు. పండిన పంట మొత్తం మాకే మిగిలేది. తిరిగి ఎవరికి పైసలు ఇచ్చుడు లేకుండే. ఇప్పడు కొత్త ప్రభుత్వం రైతుబంధు ఇయ్యకుండా రైతులను ఇబ్బందులు పెడుతాంది. పాత రోజులు గుర్తుకు వస్తానయి. ఇలా అయితే రైతులు వ్యవసాయం బందు చేసుడే అయితది.