Dallas | డల్లాస్, టెక్సాస్: డల్లాస్ పరిసర ప్రాంతం ఇర్వింగ్ (Irving) నగరంలో ఉన్న అమెరికాలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ స్మారకం వద్ద ‘హర్ ఘర్ తిరంగా’ అనే నినాదంతో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి రావు కల్వల స్వాగత శుభాకాంక్షలతో భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. ముందుగా సంగీత గురు సమీర శ్రీపాద ఆధ్వర్యంలో శిష్యులు అమెరికా జాతీయగీతంతో సహా అనేక భారతదేశభక్తి గీతాలను ఆలపించారు.
మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి “భారతదేశ స్వాతంత్ర్య సమరంలో పాల్గొని మహాత్మాగాంధీ, నెహ్రు, వల్లభ్భాయ్ పటేల్, నేతాజీ, వీర సావర్కర్, భగత్ సింగ్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ త్యాగాలు మరువలేనివి అని అన్నారు. ప్రవాస భారతీయలుగా అమెరికా దేశ చట్టాలను గౌరవిస్తూ అమెరికా జనజీవన స్రవంతిలో భాగం కావలసిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ ఎల్ జపంటా మాట్లాడుతూ.. రెండు ప్రముఖ ప్రజాసామ్య దేశాలైన అమెరికా, భారత్ మధ్య దృఢమైన సంబంధాలు నెలకొల్పడంలో ప్రవాస భారతీయలు ప్రముఖ పాత్ర వహిస్తున్నారని అన్నారు. భారత జాతీయగీతంతో పాటు అమెరికా జాతీయగీతం కూడా ఆలపించడం సబబుగా ఉందంటూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రత్యేక అతిథిగా హాజరైన ఈనాడు దినపత్రిక సంపాదకులు ఎం. నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘ప్రవాస భారతీయలు మాతృభూమికి వేల మైళ్ల దూరంలో ఉన్నా వారి హృదయాలకు భారతదేశం ఎల్లప్పుడూ దగ్గరగానే ఉంటుందని అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను విదేశంలో విస్తరిస్తూ, భారతదేశ ప్రగతికి తోడ్పడుతున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గత 79 సంవత్సరాల్లో భారత్లో అక్షరాస్యత 12 నుంచి 81 శాతానికి పెరిగిందని అన్నారు. ఒకప్పుడు ఆహార కొరతతో బాధపడిన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల ఉత్పత్తి దారుల్లో ఒకటిగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల సంఖ్య 20 నుంచి 1200కు పైగా పెరిగాయని, విమానాశ్రయాల సంఖ్య 12 నుంచి 166 కు పెరిగాయని వివరించారు. కొవిడ్ సమయంలో ఎన్నో దేశాలకు సైతం టీకాలను అందించే స్థాయికి భారత్ చేరిందని అన్నారు.

Independenced Day
ఆత్మీయ అతిథిగా హాజరైన ప్రముఖ కవి, సినీగీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు త్రివర్ణ పతాకంపై ఒక పద్యాన్ని గానం చేశారు. ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రముఖ సంఘసేవకులు వామరాజు సత్యమూర్తి ప్రవాస భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ రక్షణలో సైనికులగా సేవలందించి అమెరికాలో స్థిరపడిన కల్నల్ రాకేష్ శర్మ, కల్నల్ హర్వీందర్ బింద్రా, 8 సంవత్సరాల్లోపు పిల్లలకు కొలంబియాలో నిర్వహించిన చెస్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన సరయు తలపనేనిలను ఇర్వింగ్ మేయర్ అల్ జపంటా, డా. ప్రసాద్ తోటకూర ఇతర అతిథులు సన్మానించారు.
మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కో చైర్మన్ తాయబ్ కుండావాలా వందన సమర్పణ చేశారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చినసత్యం వీర్నపు చేసిన సేవలను కొనియాడారు. బోర్డు సభ్యులు కలై, మురళి వెన్నం, ముర్తుజా, రాజేంద్ర వంకావాలా, తిరుమల్ రెడ్డి, అనంత్ మల్లవరపుతో సహా ఎంవీఎల్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ పూర్వ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డా. కే అరవిందరావు, ప్రవాస భారతీయులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ‘ఇండియా టుడే’ రెస్టారెంట్ వారు అల్పాహారం అందజేశారు.