విద్యార్థులతో కలిసి తల్లిదండ్రుల ధర్నా
నాంపల్లి, ఆగస్టు 18 : నాంపల్లి మండలం చిట్టెంపహాడ్ ప్రాథమిక పాఠశాలలో 45 మంది విద్యార్ధులకు ఒక్కరే ఉపాధ్యాయురాలు ఉండడంతో విద్యార్ధులకు నాణ్యమైన విద్య బోధించడానికి అవసరమైన ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఇప్పటికే అనేకమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా నిర్లక్ష్యం చేయడంతో విద్యార్ధుల భవిష్యత్ కోసం ఆవేదన చెందిన విద్యార్ధుల తల్లిదండ్రులు, గ్రామస్తులు, విద్యార్ధులతో కలిసి రోడ్డుపై ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. రోడ్డుపై వాహనాలు బారులు తీరడంతో నాంపల్లి సీఐ దూది రాజు, ఏ ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్ధుల తల్లిదండ్రులు, గ్రామస్తులతో మాట్లాడి ధర్నాను విరంపజేశారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా ట్రాఫిక్ క్లియర్ చేశారు.