గోవిందరావుపేట/వెంకటాపూర్, డిసెంబర్ 10 : పర్యాటక ప్రాంతమైన లక్నవరం సరస్సు పర్యాటకులతో కళకళలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో కిటకిటలాడింది. మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకొని తిరుగు ప్రయాణంలో సాయంత్రం వేళలో లక్నవరం చేరుకొని వేలాడే వంతెనలపై నడుస్తూ బోట్లలో షికారు చేశారు. ఈ సందర్భంగా సరస్సు అందాలను తిలకించి సెల్ఫీ, ఫొటోలు తీసుకొని మురిసిపోయారు. అలాగే ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం భక్తులతో సందడిగా కనిపించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ర్టాల నుంచి వేలాది మంది పర్యాటకులు, విద్యార్థులు, భక్తులు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. తాడ్వాయిలోని గిరిజన పాఠశాలకు చెందిన వనవాసీ ఆశ్రమ నిలయ ప్రముఖ్ ఆకుల సాంబయ్య ఆధ్వర్యంలో 50 మంది వనవాసీ విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పూజరులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ చరిత్ర, విశిష్టతను టూరిజం గైడ్స్ వివరించగా ఆసక్తిగా విని ఆనందం వ్యక్తం చేశారు. ఆ తర్వాత రామప్ప సరస్సుకు చేరుకొని పర్యాటక శాఖ బోట్లలో షికారు చేసి ఆహ్లాదంగా గడిపారు.