రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేయడంతో గ్రేటర్ వరంగల్ అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. ఐదు నియోజకవర్గాల్లో విస్తరించిన మహానగర పాలక సంస్థ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టిసారించారు. వేలాది కోట్లు విడుదల చేయడంతో ప్రగతిపథంలో దూసుకెళ్తోంది. తొమ్మిదేళ్లలో పథకాల ద్వారా రూ.2,572.77 కోట్లతో 10,351 అభివృద్ధి పనులు చేపట్టగా, అందులో రూ.874.95 కోట్లకు సంబంధించిన 7,554 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. రూ.1,126కోట్లతో చేపట్టిన 583 పనులు పురోగతిలో ఉండగా, రూ.571.78కోట్లకు చెందిన 2,214 పనుల టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది. ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడేలా చేయడంతోపాటు చారిత్రక నగరాన్ని బెస్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తోంది.
– వరంగల్, మార్చి 5
వరంగల్, మార్చి 5: వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఐదు నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న వరంగల్ మహానగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధుల వరద పారిస్తోంది. గ్రేటర్ కార్పొరేషన్లో వీలీనమైన గ్రామాలు పట్టణీకరణ వైపు అడుగులు వేస్తున్నాయి. గ్రేటర్ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందేలా జరుగుతోంది. గత పాలకులు నిర్లక్ష్యం వహించగా స్వరాష్ట్ర పాలనలో నగరం ప్రగతిపథంలో దూసుకెళ్తోంది.
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధితో నగర రూపురేఖలు మారుతున్నాయి. సీఎం కేసీఆర్ నగరాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తూ వేల కోట్ల నిధులు మంజూరు చేశారు. తొమ్మిదేళ్ల నుంచి 2023 వరకు) పాలనలో వివిధ పథకాల ద్వారా నగరాభివృద్ధి కోసం 10,351 అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పటికే రూ.874.95 కోట్లతో 7,554 పనులను పూర్తిచేశారు. రూ.1,126కోట్లతో చేపట్టిన 583 పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. రూ.571.78కోట్లతో చేపట్టనున్న 2,214 పనులు టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకున్నాయి.గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో ఎటుచూసినా పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయి. నగరాన్ని రాబోయే తరానికి ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేస్తోంది. ప్రజలకు మౌలిక వసతుల కల్పనతోపాటు జాతీయస్థాయిలో బెస్ట్ లివింగ్ సిటీగా గుర్తింపు తీసుకువచ్చేలా ముందుకుసాగుతోంది.
పెరుగుతున్న జీవన ప్రమాణాలు..
వరంగల్ నగరంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి. నగరంలోని అన్ని కాలనీల్లో అంతర్గత రహదారులు, డ్రెయినేజీ నిర్మాణాలు చేపడుతున్నారు. దశాబ్ధాల నాటి నగర ప్రధాన రహదారులు స్మార్ట్గా మారుతున్నాయి. గ్రీన్సిటీగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రతి డివిజన్లో పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. హరితహారం నిధులతో ప్రతి మూడు డివిజన్లకు ఒక నర్సరీ చొప్పున ఏర్పాటు చేశారు. నగరంలో వైకుంఠధామాల నిర్మాణాలు వేగంగా రాష్ట్రంలోనే గ్రేటర్ వరంగల్లో రూ.2కోట్లతో మోడల్ వైకుంఠధామం పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉంది. చారిత్రక నగరాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తున్నారు. ఇప్పటికే భద్రకాళీ బండ్, వడ్డేపల్లి బండ్ ప్రజలకు ఉర్సు చెరువును అభివృద్ధి చేసేందుకు రూ.14.50కోట్లతో అభివృద్ధి చేయబోతున్నారు. ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ పనులు చకచక సాగుతున్నాయి. కళాక్షేత్రం పనులు రెండు నెలల్లో పూర్తి కానున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా నగరంలో అభివృద్ధి జరుగుతోంది.