హనుమకొండ, జూలై 31 : వరద బాధితులకు తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని వరద బాధితులకు ఉపశమనం కలుగనుంది. జిల్లాల్లో వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పల్లెలు, పట్టణాలు పెద్దఎత్తున నష్టపోయాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలయం కావడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వాగులు వంకలు పొర్లడంతో పంటలు దెబ్బతినడం, పశువులు చనిపోవడం, చెరువుల కట్టలు తెగడంతో భారీగా నష్టం వాటిల్లింది.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ భారీ వర్షాలు, వరదలపై ఎప్పటికప్పుడు ఆయా జిల్లాల అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులతో పరిస్థితిని సమీక్షించి దిశా నిర్ధేశం చేశారు. అధికారులు ముందస్తుగా అప్రమత్తం కావడంతో నష్టం ఎక్కువగా జరుగుకుండా నివారించగలిగారు. ఇప్పటికే అధికారులు ఆయా జిల్లాల్లో జరిగిన నష్టంపై ప్రాథమిక అంచనా వేశారు. ప్రభుత్వం తక్షణ సాయం ప్రకటించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరదల ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ భరోసా కలుగనుంది. ముఖ్యంగా ఇళ్లు కోల్పోయిన వారు, గాయాల పాలైన వారు, పంట నష్టం జరిగిన వారికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆసరా లభించనుంది.