సుబేదారి, ఏప్రిల్ 7: పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో పోలీసుల విచారణ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఈ కేసులో ఏ1 గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఏ2గా బూర ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా శివగణేష్, ఏ5గా మైనర్ బాలుడు ఉన్నారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరికి ప్రమే యం ఉందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. నిం దితులు ప్రశ్నపత్రాన్ని సెల్ఫోన్లల ద్వారా వాట్సాప్ గ్రూప్ లకు పంపించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందు లో భాగంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఆయన పీఏలు రాజు, నరేందర్కు రెండు రోజుల క్రితం పోలీసులు నోటీసులు అందజేశారు. ఈ నేపథ్యంలో ఈటల పీఏలను శుక్రవారం విచారణ కోసం కమలాపూర్ పోలీసులు వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ జరిపారు.
ఈటల పీఏల సెల్ఫోన్లు స్వాధీనం
ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పీఏలు రాజు, నరేందర్ను హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో రెండు గంటల పాటు విచారించారు. వారిద్దరి సెల్ఫోన్లకు వాట్సాప్ ద్వారా హిందీ ప్రశ్నపత్రం పంపించింది ఎవరు ? అనే కోణంలో ఆరా తీశారు. ఈకేసులో ఏ3గా ఉన్న మహేశ్ వాట్సాప్ ద్వారా రాజు, నరేందర్కు లీకేజీ ప్రశ్నంపత్రాన్ని పంపించినట్లు పోలీసుల విచారణ తేలినట్లు తెలిసింది. విచారణలో భాగంగా వీరి సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సెల్ఫోన్ల ఆధారంగా సాంకేతిక పరమైన ఆధారాలు సేకరించేందుకు చర్యలు తీసుకున్నారు. వీరిద్దరి సెల్ఫోన్ల నుంచి ఎంకా ఎవరికైనా పేపర్ లీకేజీ ప్రశ్నపత్రాన్ని సోషల్ మీడియా ద్వారా పంపించారా? వ్యక్తి గతంగా ఎవరితోనైనా మాట్లాడారా ? అనే కోణంలో కాల్ లిస్ట్, వాట్సాప్ మెసేజ్లను పోలీసులు సేకరిస్తున్నట్లు తెలిసింది.
10న ఈటల విచారణ
పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు నోటీసులు అందజేశారు. ఈ నెల 7న వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరుకావాలని కోరారు. అయితే ఈనెల 8న హైదరాబాద్లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన ఉన్నందున 7న హాజరుకాలేనని,10న హాజరవుతానని ఈటల పోలీసులకు తెలిపినట్లు తెలిసింది. ఈటలను సోమవారం పోలీసులు విచారించనున్నారు.
వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు త్వరలో నోటీస్లు
టెన్త్ హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో నిందితుల సెల్ఫోన్ల నుంచి తొలుత వాట్ఫాప్ గ్రూప్ ద్వారా ప్రశ్నపత్రం లీకేజీ మెసేజ్లు వచ్చిన గ్రూపు అడ్మిన్లు ఆరుగురిని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. వీరికి కమలాపూర్ పోలీసులు త్వరలో నోటీస్లు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.