న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టేందుకు రాజ్యాంగ సవరణ కోసం కొత్త బిల్లును తీసుకురావడంపై నరేంద్ర మోదీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ ఒకవేళ తీసుకువచ్చిన పక్షంలో లోక్సభలో 22 మంది సభ్యులు, రాజ్యసభలో 8 మంది సభ్యులు ఉన్న డీఎంకే వైఖరి పైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ వివాదాస్పద బిల్లుకు లోక్సభలో ఆమోదం పొందడం ప్రభుత్వానికి కష్టతరం కానున్నది. తమిళనాడులో విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చి కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి పాల్పడిందని ఆరోపిస్తూ ఇండియా కూటమి నుంచి వెలుపలకు వచ్చిన డీఎంకే రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వడంపై ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.
అయితే కొత్త బిల్లును పరిశీలించిన తర్వాతే తన ఆలోచనను బయటపెడతానని ఆ పార్టీ స్పష్టం చేసింది. తాము కాంగ్రెస్తో పనిచేయకపోవచ్చేమో కాని ప్రతిపక్ష పాత్రను మాత్రం వదిలిపెట్టలేదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. వందేమాతరం బిల్లు, పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించిన బిల్లుపై సవరణలు ప్రతిపాదించడం ద్వారా, అలాగే వాటికి వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా తాము తమ వైఖరిని చాటుకున్నామని వారు గుర్తుచేస్తున్నారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ నిరసనలో భాగంగా డీలిమిటేషన్ బిల్లు ప్రతిని ఇప్పటికే దహనం చేసినందున ఆ పార్టీ ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయదని ఇండియా కూటమిలోని పార్టీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.